శ్రీలంకకు భారత్ భారీ ఆర్థిక సాయం.. రాజపక్సతో అజిత్ దోవల్ భేటీ
ఉగ్రదాడులు, హెచ్చరికలతో సతమతమవుతోన్న శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. సెక్యూరిటీని కట్టుదిట్టం చేసుకునేక్రమంలో ఆయుధాలు, ఇతరత్రా పరికరాల కొనుగోలు కోసం ఏకంగా 50 మిలియన్ డాలర్ల(సుమారు 400 కోట్ల) ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కొలంబోలో పర్యటిస్తున్న జాతీయ భద్రతా సహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఈ మేరకు ఆదివారం శ్రీలకం ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్సకు హామీ ఇచ్చారు.
''ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తో చర్చలు స్నేహపూర్వకంగా జరిగాయని, జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్ షేరింగ్, సముద్ర భద్రతతోపాటు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకునే దిశగా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. శ్రీలంక సెక్యూరిటీ అవసరాల కోసం ఇండియా 50 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందిస్తున్నది దోవల్ హామీ ఇచ్చారు''అని శ్రీలంక ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది.
రెండ్రోజుల పర్యటన కోసం శనివారం కొలంబో వెళ్లిన దోవల్.. ప్రెసిడెంట్ తో చర్చలకు ముందు పలువురు మంత్రలు, రాయబారులతోనూ సమావేశమయ్యారు. దోవల్ కంటే కొద్దిరోజుల ముందే మన విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా శ్రీలంకలో కీలక పర్యటన చేశారు. శ్రీలంక ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత గొటబాయ రాజపక్స తన మొదటి విదేశీ పర్యటనగా భారత్ కు రావడం, ప్రధాని మోదీతో చర్చలు జరపడం తెలిసిందే.