దోవల్ చైనా పర్యటన రద్దు: పంజాబ్లో ముగ్గురు అరెస్ట్
న్యూఢిల్లీ: ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తన చైనా పర్యటన రద్దు చేసుకున్నారు. మంగళవారం చైనా రాజధాని బీజింగ్లో ఇరు దేశాల మధ్య పలు అంశాలపై చర్చల కోసం ఆయన వెళ్లాల్సి ఉండగా, పంజాబ్లోని పఠాన్కోట్ ఉగ్రవాదుల దాడి కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నారు.
బుధవారం చైనా ప్రధాని లీ కెకియాంగ్తో కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం కావాల్సి ఉంది. అయితే ఈ సమావేశాలన్నీ రద్దయయ్యాయి. మళ్లీ చైనా పర్యటన ఎప్పుడు ఉంటుందనే అంశంపై ఇరు దేశాల అధికారులు చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, పంజాబ్లోని మొహాలీలో సోదాలు నిర్వహిస్తుండగా ముగ్గురు అనుమానితులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పాకిస్థానీ మొబైల్ సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, ఆటోమెటిక్ రైఫిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పఠాన్కోట్ ఎయిర్బేస్లో ఉద్రవాదుల ఏరివేత మూడోరోజుకు చేరుకుంది. దేశంలోని అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. పఠాన్కోట్ ఎయిర్బేస్లో సిబ్బంది క్వార్టర్స్లో చొరబడిన ఐదుగురు ఇప్పటికే మట్టుబెట్టామని ఎన్ఎస్జీ దళాలకు చెందిన సీనియర్ అధికారులు ప్రకటించారు.
అయితే మరో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉండొచ్చని, వాళ్లను అంతం చేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ, ఎయిర్ఫోర్స్, ఎన్ఎస్జీ దళాలకు చెందిన సీనియర్ అధికారులు పేర్కొన్నారు.