ఆపరేషన్ నిజాముద్దీన్: రంగంలో దిగిన అజిత్ దోవల్: అర్ధరాత్రి 2 గంటలకు మర్కజ్ మసీదు వద్ద..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోవడానికి ఢిల్లీ మత ప్రార్థనలే ప్రధాన కారణమంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కొత్తగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఢిల్లీ మత ప్రార్థనలతో సంబంధం ఉండటమే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. దీనితో ప్రస్తుతం అందరి దృష్టీ మత ప్రార్థనలకు కేంద్రబిందువైన మర్కజ్ మసీదు భవన సముదాయంపై నిలిచాయి.
మర్కజ్ భవనాన్ని ఖాళీ చేయడానికి నిరాకరించిన మత పెద్దలు..
కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన పరిస్థితుల్లో మర్కజ్ భవనాన్ని ఖాళీ చేయాలంటూ ఢిల్లీ పోలీసులు జారీ చేసిన ఆదేశాలను మత పెద్దలు ధిక్కరించినట్లు తెలుస్తోంది. భవనాన్ని ఖాళీ చేయాలంటూ కిందటి నెల 23వ తేదీ నాడే నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేష్ వలియాల్ మర్కజ్ మత పెద్దలను పిలిపించి మరీ విజ్ఙప్తి చేశారు. అయినప్పటికీ వారు అంగీకరించలేదు.
ఢిల్లీ పోలీసుల ప్రయత్నాలు వృధా కావడంతో
23వ తేదీన మత పెద్దలతో సమావేశం అనంతరం ప్రతిరోజూ నిజాముద్దీన్ పోలీసులు మర్కజ్ భవనానికి వెళ్లినట్లు తేలింది. భవనాన్ని ఖాళీ చేయాలంటూ అన్ని రకాలుగా వారికి సూచించినప్పటికీ.. పట్టించుకోలేదు. మత ప్రార్థనలు ముగిసిన తరువాత కూడా వందలాది మంది మసీదు భవన సముదాయంలో నివసిస్తుండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. పలుమార్లు నోటీసులను సైతం జారీ చేసినా ఫలితం కనిపించలేదు.
28వ తేదీ అర్ధరాత్రి హైడ్రామా..
ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు వివరించారు. దీనితో ఆ శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. జాతీయ భద్రతా సలహాదారు, ట్రబుల్ షూటర్గా పేరున్న అజిత్ దోవల్తో సమావేశం అయ్యారు. పరిస్థితిని వివరించారు. మర్కజ్ భవనాన్ని ఖాళీ చేయించాల్సిన బాధ్యతను ఆయనకు అప్పగివంచారు. ఈ నెల 28వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో అజిత్ దోవల్ మర్కజ్ మసీదు భవనానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట అతి కొద్దిమంది మాత్రమే కీలకమైన భద్రతా అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
మౌలానా సాద్తో ఫేస్ టు ఫేస్..
మర్కజ్ మసీదు భవన సముదాయం ప్రధాన మౌల్వీ మౌలానా సాద్తో అజిత్ దోవల్ ముఖాముఖి మాట్లాడారని చెబుతున్నారు. అప్పటికే తెలంగాణలో ఇండోనేషియాకు వెళ్లొచ్చిన ఎనిమిది మందిలో కరోనా వైరస్ సోకిన ఉదంతాన్ని అజిత్ దోవల్.. మౌలానా సాద్ దృష్టికి తీసుకెళ్లారని, పరిస్థితి తీవ్రత గురించి వివరించాని సమాచారం. అజిత్ దోవల్తో చర్చల అనంతరం మౌలానా సాద్ మెత్తబడ్డారని, భవనాన్ని ఖాళీ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
అదే రోజు మధ్యాహ్నం నుంచే
అజిత్ దోవల్తో జరిగిన సంభాషణ సారాంశాన్ని మౌలాసా సాద్ తన తోటి ప్రతినిధులు వివరించడంతో పాటు 29వ తేదీ మధ్యాహ్నం నుంచే భవనాన్ని ఖాళీ చేయడం ఆరంభించినట్లు అంటున్నారు. బుధవారం తెల్లవారు జామున 4 గంటల సమయానికి మర్కజ్ భవనం మొత్తం ఖాళీ అయింది. 2376 మందిని ఢిల్లీ అధికారులు, పోలీసులు వేర్వేరు క్వారంటైన్లకు తరలించారు. 30, 31వ తేదీల్లో భవనాన్ని పూర్తిగా ఖాళీ చేశారు. దీనితో ఆపరేషన్ నిజాముద్దీన్ పూర్తయిందని చెబుతున్నారు.