చంద్రబాబు వెనకాలు బ్లాక్ కమాండోలు కనిపించరు..కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం ఆ దిశగా మరో నిర్ణయం తీసుకుంది. దేశంలో కొందరి వీఐపీలకు భద్రతగా ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీని తొలగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో వీఐపీల వద్ధ విధులు నిర్వర్తిస్తున్న బ్లాక్ కమాండోలు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బయటకు రానున్నారు. వాస్తవానికి 1984లో ఎన్ఎస్జీని ఏర్పాటు చేశాక వారిని కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్కు వినియోగించాలని అప్పటి ప్రభుత్వం భావించింది.
దేశంలో 13 మంది వీఐపీలకు బ్లాక్ కమాండోల సేవలు
ఎన్ఎస్జీ కమాండోలో నల్లటి దుస్తులు ధరించి అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉంటారు. ఒక వీఐపీ ఒక చోట ఉన్నారంటే అతని చుట్టుపక్కల పరిసరాలపై ఈ బ్లాక్ కమాండోలు డేగ కన్నేసి ఉంటారు. దేశంలో ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించే 13 మంది వీఐపీలకు బ్లాక్ కమాండోలు సేవలందిస్తున్నారు. ఒక్కో వీఐపీకి 24 మంది బ్లాక్ కమాండోలు ఉన్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ల వద్ద ఉన్న ఎన్ఎస్జీ కమాండోలను తిరిగి పారామిలటరీ బలగాలకు బదిలీ చేస్తారని తెలుస్తోంది. ఇక ఎన్ఎస్జీ సేవలు పొందుతున్న ఇతర వీఐపీల్లో మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, ములాయం సింగ్, చంద్రబాబు నాయుడు, ప్రకాష్ సింగ్ బాదల్, ఫరూక్ అబ్దుల్లా, అస్సాం ముఖ్యమంత్రి శరబానంద్ సోనోవాల్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలు ఉన్నారు.
దేశవ్యాప్తంగా వీఐపీల వద్ద 450 బ్లాక్ కమాండోలు
ఏ ఉద్దేశం కోసమైతే ఎన్ఎస్జీని తీసుకురావడం జరిగిందో దానికోసమే ఇకపై బ్లాక్ కమాండోలు పనిచేస్తారని కేంద్ర హోంశాఖ తెలిపింది. అంటే కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ కోసం ఇకపై వారి సేవలను వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. ఉగ్రవాదం అణిచివేయడం, యాంటీ హైజాక్ ఆపరేషన్స్లో వీరు ఇకపై పాల్గొంటారని కేంద్రం స్పష్టం చేసింది. ఇక వీఐపీల నుంచి ఎన్ఎస్జీలకు విముక్తి కల్పించడంతో దేశవ్యాప్తంగా ఉన్న 450 మంది కమాండోలకు విముక్తి కలుగుతుందని కేంద్రం తెలిపింది. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎన్ఎస్జీలను పారామిలటరీ దళాలకు బదిలీ చేయడం జరుగుతుంది. అంటే సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలకు బదిలీ చేయడం జరుగుతుంది.
టెర్రర్ ఆపరేషన్స్ కోసం ఎన్ఎస్జీ కమాండోలు
అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన భార్య, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమె పిల్లలు అయిన ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీలకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణగా ఉండగా వారిని తొలగించింది కేంద్రం. తొలగించిన వీరిని సీఆర్పీఎఫ్కు అప్పజెప్పింది. వీఐపీలకు ఎన్ఎస్జీ కమాండోలను తొలగించడం వల్ల మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఎక్కడైనా ఒకే సారి ఉగ్రదాడులు జరిగితే ఎక్కడో ఒక వీఐపీకి రక్షణగా ఉన్న ఎన్ఎస్జీలు మరో మూలకు పరుగులు తీయాల్సి వస్తోందని చెబుతోంది.
మోడీ సర్కార్ భద్రతపై తీసుకుంటున్న కీలక నిర్ణయాలు
ఉదాహరణకు ముంబై ఉగ్రదాడులు జరిగిన సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్జీలు ఘటనా స్థలంకు చేరుకునేందుకు కాస్త ఆలస్యమైందని అయితే ఈ ఆపరేషన్లో 400 మంది కమాండోలు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్ఎస్జీకి మంచి కమాండోలు అందుబాటులో ఉండాలని అదే సమయంలో కొందరిని రిజర్వ్లో ఉంచాలని కేంద్రం భావిస్తోంది. మోడీ సర్కార్ రెండో సారి ప్రభుత్వంలోకి వచ్చాక గతేడాది జూలైలో దేశ భద్రతపై జరిపిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీఐపీలకు భద్రతగా ఉన్న 1300 మంది కమాండోలను తొలగించింది. ఉద్దేశించిన పనికోసమే బ్లాక్ కమాండోల సేవలను వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.