ఈ-సిగరెట్లే కాదు... ఇక్కడ అన్ని పొగాకు ఉత్పత్తులపై బ్యాన్ విధించండి
ఈ- సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని స్వాగతించింది గోవా కాంగ్రెస్ విద్యార్థి అనుబంధ సంస్థ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా.అంతేకాదు మిగతా పొగాకు ఉత్పత్తులపై కూడా నిషేధం విధించాలని కోరింది. ఈ మేరకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ కేంద్రఆర్థికశాక మంత్రి నిర్మలాసీతారామన్కు లేఖ రాశారు ఎన్ఎస్యూఐ గోవా చీఫ్ అహ్రాజ్ ముల్లా.ఈ దేశ యువత భవిష్యత్తును కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు అహ్రాజ్ ముల్లా.
బుధవారం రోజున ఈ-సిగిరెట్ల వినియోగంను, అమ్మకాలను, కొనుగోలును నిషేధం విధిస్తిన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. దీనివల్ల యువత ఆరోగ్యాలు చెడిపోతున్నాయని ఆమె తెలిపారు. అంతేకాదు ఈ-సిగరెట్లను ఇకపై వినియోగిస్తే శిక్ష పడేలా ఆర్డినెన్స్ను కూడా తీసుకొస్తామని చెప్పారు. మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చట్టం చేస్తామని సీతారామన్ వెల్లడించారు. ఈ- సిగరెట్లపై నిషేధం విధించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ఎన్ఎస్యూఐ... అదేసమయంలో సాధారణ సిగరెట్లపై ఎందుకు నిషేధం విధించడంలేదో కాస్త ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించింది.
కేవలం ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తే వాటికి అలవాటు పడ్డ యువత సాధారణ సిగరెట్ల వైపు మొగ్గు చూపుతుందని ముల్లా చెప్పారు. సిగరెట్టులో ఒక పఫ్ పీల్చి పొగ వదలడం ద్వారా నికోటిన్ వినియోగం ఎక్కువగా ఉంటుందని అది ఒక పూర్తి ఈ-సిగరెట్ కంటే ఎక్కువ ప్రమాదమని ముల్లా తెలిపారు. అంటే ఈ- సిగరెట్లు ఆరోగ్యానికి చేటు చేయవని దానర్థం కాదని సాధారణ సిగరెట్లు మరింత ప్రమాదం అని ముల్లా స్పష్టం చేశారు. ప్రభుత్వం నిజంగానే ప్రజల ఆరోగ్యం కోరుకుంటున్నట్లయితే... రెగ్యులర్ సిగరెట్లతో పాటు ఇతర పొగాకు ఉత్పత్తులపై కూడా నిషేధం విధించాలని ముల్లా డిమాండ్ చేశారు.