ఎన్టీపీసీలో పేలుడు: 18కి చేరిన మృతుల సంఖ్య, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలి ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్లో బుధవారం బాయిలర్ పైపు పేలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. ఈ ప్రమాదంలో మరో వంద మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.
రాయ్బరేలి: ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలి ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్లో బుధవారం బాయిలర్ పైపు పేలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. ఈ ప్రమాదంలో మరో వంద మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.
పవర్ ప్లాంట్లోని ఆరో యూనిట్లో ఈ పేలుడు సంభవించింది. బాయిలర్ పైప్ తెరిచిన వెంటనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ పేలుడు వార్తను రాయ్బరేలి జిల్లా మేజిస్ట్రేట్ కూడా ధ్రువీకరించారు.
క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. పేలుడు జరిగే సమయంలో ప్లాంట్లో 150 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ప్రస్తుతం ప్లాంట్ లోపలికి ప్రవేశించేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి..
ఎన్టీపీసీ పేలుడు ఘటనపై మారిషస్ పర్యటనలో ఉన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శిని సీఎం యోగి ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం...
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు.
సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది...
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు 32 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు 'ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. వేడి ఇంధనం బయటకు రావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున దుమ్ము ఆవరించడంతో సహాయక చర్యలకు స్వల్ప ఆటంకం కలుగుతోంది' అని ఎన్టీపీసీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ప్లాంట్ను తాత్కాలింగా మూసివేశారు.
సోనియాగాంధీ విచారం....
ఈ ఘటనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాల్సిందిగా ఆమె సూచించారు.
క్షతగాత్రులకు మంత్రి పరామర్శ...
యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య క్షతగాత్రులను పరామర్శించారు. ఇప్పటికే ప్రమాద మృతులకు రెండు లక్షల చొప్పున యూపీ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో సుమారు వంద మంది గాయపడినట్లు యూపీ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు.