ఢిల్లీలో డెసిషన్స్..బెంగళూరులో వైబ్రేషన్స్ : పద్మవ్యూహంలో కుమారస్వామి
బెంగళూరు: కర్నాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలురాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం వెంటిలేటర్పై ఉంది. ఏ క్షణమైనా ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో తెరపైకి ఎన్నో సమీకరణాలు వస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం పడిపోకుండా ఇటు కాంగ్రెస్ అటు జేడీఎస్లు దిద్దుబాటు చర్యలకు దిగారు.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అసలే కుమార స్వామి సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేల రాజీనామాలతో సతమతమవుతుంటే... మరో స్వతంత్ర ఎమ్మెల్యే నాగేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఇక కర్నాటక రాజకీయ సంక్షోభం రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకోనుంది... సమీకరణాలు ఎలా ఉండనున్నాయి... ఈ గండం గట్టెక్కాలంటే ఏమి చేయాలి..?
కర్నాటకలో సంక్షోభం
కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలేలా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ముంబై క్యాంపులో ఉంటుండగా... కుమారస్వామి ప్రభుత్వానికి సంఖ్యా బలం లేదని వెంటనే సీఎంగా ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కర్నాటక ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్లక ముందు పరిస్థితి ఇలా ఉన్నింది. 225 సభ్యులు గల కర్నాటక అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113. ఎమ్మెల్యేల రాజీనామాలు చేయకముందు కాంగ్రెస్కు 78 మంది ఎమ్మెల్యేలు ఉండగా జేడీఎస్కు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నింది.బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. ఇక కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నామినేటెడ్ ఎమ్మెల్యే, బీఎస్పీ, ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థి సపోర్టు ఉన్నింది. దీంతో 119 మంది సభ్యుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.
ప్రస్తుత పరిస్థితి ఇదీ...!
13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే కర్నాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 225 నుంచి 212కు పడిపోతుంది. ఇక ఇందులో సగంగా ఉండాల్సిన సంఖ్య కూడా 113 నుంచి 106కు పడిపోతుంది. కాంగ్రెస్ జేడీఎస్లకు మద్దతుగా ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా బీజేపీకి మద్దతును ప్రకటించారు.దీంతో కాంగ్రెస్ జేడీఎస్ల బలం 105కు పడిపోయింది. అసెంబ్లీలో బీజేపీ బలం 106కు పెరిగింది.ఇక కర్నాటకా అసెంబ్లీలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిద్దాం.
కాంగ్రెస్ జేడీఎస్లు అధికారంలో ఉంటే...
కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం కొనసాగాలంటే రాజీనామా చేసిన ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించకూడదు అదే సమయంలో వారి రాజీనామాలను వెనక్కు తీసుకోమని కోరే అవకాశం ఉంది. దీంతో పాటు వారికి మంత్రి పదవులు ఇచ్చేలా అధినాయకత్వం పావులు కదపాల్సి ఉంటుంది. సోమవారం ఉదయం కాంగ్రెస్ మంత్రుల రాజీనామాలు ఇందుకోసమే అన్నట్లుగా ఉంది.మరోవైపు జేడీఎస్ మంత్రులు కూడా రాజీనామా చేయాల్సిందిగా కుమారస్వామి కోరే అవకాశం ఉంది. దీంతో జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు లైన్ క్లియర్ చేసే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి తలెత్తితే కుమారస్వామి సీఎంగా కొనసాగే అవకాశాలున్నాయి లేదా... తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి అభ్యర్థికి సీఎం అయ్యే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
బీజేపీ అధికారంలోకి రావాలంటే...
ప్రస్తుతం నంబర్ గేమ్ చేస్తే కర్నాటక అసెంబ్లీలో బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతోంది. 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే 105 సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ముందుగా పడిపోతుంది. దీంతో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా రెండో అతిపెద్ద పార్టీ బీజేపీని ఆహ్వానించే అవకాశం ఉంది. 106 మంది సభ్యులతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఇక 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే కాంగ్రెస్ జేడీఎస్ల ప్రభుత్వం కుప్పకూలుతుంది. అయితే బీజేపీని ప్రభుత్వం ఏర్పా
హంగ్ అసెంబ్లీ
ఇక చివరి అస్త్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వస్తే హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే తన వారసుడిని ప్రకటించే వరకు రాహుల్ గాంధీనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తమ ఎమ్మెల్యేలను ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోమని ఆదేశిస్తే కర్నాటక హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది.ఇలా జరిగితే 13 మంది ఎమ్మెల్యేలు కర్నాటక అసెంబ్లీలోనే ఉంటారు. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 113 మేజిక్ ఫిగర్ ఎవరికీ ఉండదు కాబట్టి కర్నాటకలో హంగ్ అసెంబ్లీ వస్తుంది. దీంతో గవర్నర్ పాత్ర ఇక్కడ కీలకం కానుంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రాష్ట్రం గవర్నర్ పాలన కిందకు వెళ్లే అవకాశం ఉంది లేదా గవర్నరే మళ్లీ ఎన్నికలు జరిగేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని అపాయింట్ చేసే అవకాశం ఉంది.
మొత్తానికి సంక్షోభంలో ఉన్న కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచిచూడాల్సిందే.