అమెరికాలో భారీగా తగ్గిపోతున్న ఇంజినీరింగ్ విద్యార్థుల సంఖ్య: కారణాలివే
వాషింగ్టన్/బెంగళూరు: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస విధానాలను కఠినతరం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులు, ఉద్యోగస్తులు అమెరికాలో ప్రవేశించడం కొంత కష్టసాధ్యంగా మారింది.
ఈ నేపథ్యంలోనే భారతదేశం నుంచి అమెరికాకు వెళ్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల సంఖ్య కూడా తీవ్రంగా తగ్గిపోవడం గమనార్హం. ఈ విషయాలు తాజా సర్వేలో వెల్లడయ్యాయి.
భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య
కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులు చదవడానికి అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2016 - 2017 మధ్యకాలంలో 21శాతం తగ్గిందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ(ఎన్ఎఫ్ఏపీ) చేపట్టిన అధ్యయనం తేల్చింది.
భారత విద్యార్థులే అధికం
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అందించిన సమాచారం ఆధారంగా ఎన్ఎఫ్ఏపీ ఈ వివరాలు వెల్లడించింది. ఇతర దేశాల నుంచి అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవటానికి వచ్చే వారి సంఖ్య కూడా 2016-2017 మధ్యకాలంలో 4శాతం తగ్గిందని తెలిపింది. దీనిలో భారత్ నుంచి వచ్చి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులే అధికం కావడం గమనార్హం.
కష్టతరంగానే..
భారత్ నుంచి వచ్చే విద్యార్థులే అమెరికా కంపెనీలకు ప్రధాన మానవ వనరులుగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా వీసా నిబంధనలు కఠినతరం కావడంతో అమెరికా వెళ్లాలనుకున్న చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాగా, భారత విదేశీ మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం 2017లో 2,06,708 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లారు.
ఇవే ప్రధాన కారణాలు
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన వీసా, వర్క్ నిబంధనలే విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుదలకు కారణమని అధ్యయనం పేర్కొంది. అంతేగాక, పెద్దనోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు కొరతా కొంతవరకూ ఈ పరిస్థితికి కారణమేనని తెలిపింది. చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని ఎన్ఎఫ్ఏపీ పేర్కొంది.