తొలిరోజే భారీగా ఫ్లైట్ సర్వీసులు రద్దు.. ఎయిర్పోర్టుల్లో గందరగోళం..
కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకుపైగా నిలిచిపోయిన విమానం సర్వీసులు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సర్వీసులకు ఏ దేశమూ అంగీకరించని నేపథ్యంలో డొమెస్టిక్ సర్వీసులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎయిర్ పోర్టుల్లో జనం సందడి కనిపించింది. కానీ అనూహ్యరీతిలో పదుల కొద్దీ సర్వీసులు సడెన్ గా రద్దైపోవడంతో ఎయిర్ పోర్టుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరుసహా దాదాపు అన్ని విమానాశ్రయాల్లో సర్వీసులు అర్ధాంతరంగా నిలిచిపోయారు. ఆ సమాచారాన్ని అప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు చేరవేయడంలో ఎయిర్ లైన్స్ విఫలం చెందడంతో ఎయిర్ పోర్టుల్లో జనం ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఢిల్లీ, ముంబయి ఎయిర్ పోర్టుల్లో ఇబ్బందుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక్క ఢిల్లీలోనే 82 విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.
సోమవారం నుంచి డొమెస్టిక్ సర్వీసులు పున:ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించినా, పలు రాష్ట్రాలు విమాన సర్వీసుల్ని అనుమతించబోమని తెగేసి చెప్పాయి. ఆర్థిక రాజధాని ముంబైకి రాను 25, పోను 25 విమానాలను మాత్రమే అనుమతిస్తామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇవి కాకుండా చాలా విమానాలు రీ షెడ్యూల్ కావడంతో ప్రయాణికులు గంటలకొద్దీ ఎయిర్ పోర్టుల్లోనే వేచిఉండాల్సి వచ్చింది.
కరోనా కట్టడిలో భాగంగా అన్ని ఎయిర్ పోర్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్, ఇతరత్రా జాగ్రతలు తీసుకున్నారు. ప్రయాణికులు ఆరోగ్య సేతు యాప్ వాడుతున్నదీ లేనిది కూడా అధికారులు తనిఖీ చేశారు. ఇంతా జరిగి, చివరికి సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఉసూరుమన్నారు. కాగా, సర్వీసులు రద్దయినందుకుగానూ టికెట్ డబ్బులు తిరిగిచ్చే విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. మొత్తంగా తొలిరోజు సర్వీసులను నడపడటంలో ఎయిర్ లైన్స్ లోపాలు బయటపడ్డాయి.