నన్ గ్యాంగ్ రేప్: కీచకుల తరఫున వాదించేందుకు లాయర్లు నో
కోల్కతా: కోల్కతా న్యాయవాదులు తీసుకున్న నిర్ణయాన్ని దేశం వ్యాప్తంగా అందరూ స్వాగతిస్తున్నారు. కోల్కతాలో నన్ సామూహిక అత్యాచారం కేసులోని నిందితుల తరుపున కేసు వాదించబోమని స్థానిక బార్ అసోసియేషన్ ప్రకటించింది.
70 సంవత్సరాల క్రైస్తవ సన్యాసినిపై అతి దారుణంగా అత్యాచారం చేసిన నిందితులను రక్షించకూడదని తాము నిర్ణయించామని బార్ అసోసియేషన్ సెక్రటరి మిలన్ సర్కార్ స్పష్టం చేశారు.
నన్ గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు ఆ కేసులోని ప్రధాన నిందితుడు సలీంను ముంబైలో అరెస్టు చేశారు. గురువారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. 70 సంవత్సరాల నన్ మీద కిరాతకంగా రేప్ జరగడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
సీఐడి పోలీసులు సీసీ కెమెరాలలోని పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సలీం అరెస్టైనా మిగిలిన వారి ఆచూకీ గుర్తించాల్సి ఉంది.
న్యాయవాదులు ఈ కేసు వాదించరాదని నిర్ణయించినా సలీం తరుపున కేసు వాదించడానికి అవకాశం ఉంది. సబ్ డివిజన్ లీగల్ ఎయిడ్ కమిటి నిందితుడు సలీంకి న్యాయసహకారం అందించే అవకాశం ఉందని సమాచారం. నిందితుడి తరఫున వాదించడానికి వాసుదేవ్ ముఖోపాధ్యాయను నియమించారని తెలుస్తోంది.