రేప్ కేసు, బాధ్యతల నుంచి తప్పుకున్న బిషప్, కేరళ పోలీసుల నోటీసులు, రండి!
కొచ్చి: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈనెల 13వ తేదీన బిషప్ ఫ్రాంకో ములక్కల్ డయోసిస్ పరిపాలనను మాన్ సిగ్నోర్ మాథ్యూ కొక్కండమ్ కు అప్పగించారని తాజాగా వెలుగు చూసింది. కేరళ పోలీసులు నోటీసులు జారీ చెయ్యడంతో బిషప్ బాధ్యతలు మరొకరికి అప్పగించారు.
బిషప్ ఫ్రాంకో ములక్కల్ జారీ చేసిన సర్య్కూలర్ మూడు రోజులు ఆలస్యంగా వెలుగు చూసింది. 2014 నుంచి 2016 మధ్య కాలంలో 13 సార్లు బిషప్ ఫ్రాంకో ములక్కల్ తన మీద అత్యాచారం చేశారని కేరళకు చెందిన నన్ ఆరోపణలు చేశారు.
బిషప్ ఫ్రాంకో ములక్కల్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అత్యాచారం కేసు నమోదు చేసిన కేరళ పోలీసు అధికారులు ఈనెల 19వ తేదీ విచారణకు హాజరుకావాలని బిషప్ ఫ్రాంకో ములక్కల్ కు నోటీసులు జారీ చేశారు.
అయితే తాను ఎవ్వరి మీద అత్యాచారం చెయ్యలేదని, నన్ చేసిన ఆరోపణలు అసత్యమని, తనకు విరుద్దంగా పోలీసులు ఆధారాలు సేకరించారని బిషప్ ఫ్రాంకో ములక్కల్ ఆరోపిస్తున్నారు. బాధ్యతల నుంచి తప్పుకున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ అధికారికంగా బిషప్ పదవికి రాజీనామా చెయ్యలేదని సమాచారం.
డబ్బు, రాజకీయ పలుకుబడి ఉపమోగించి తన మీద తప్పుడు కేసు పెట్టించారని, దేవుడు తనను రక్షిస్తాడనే నమ్మకం ఉందని బిషప్ ఫ్రాంకో ములక్కల్ అంటున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని నన్ ల మీద అత్యాచారం చేస్తున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ ను జలంధర్ డయోసిస్ బాధ్యతల నుంచి తప్పించాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు.