నన్పై అత్యాచారం: భారీ కుట్ర దాగి ఉందా?
న్యూఢిల్లీ: నన్పై అత్యాచారం కేసులో భారీ కుట్ర దాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తన బృందాన్ని ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు పంపించింది. దర్యాప్తు అధికారులను తప్పు దోవ పట్టించే ఉద్దేశంతో ముఠా పలు గ్రూపులుగా విడిపోయినట్లు తెలుస్తోంది.
ముఠాలోని నిందితుల్లో అత్యధికులను గుర్తు తెలియని వ్యక్తి చేరదీసి కుట్రకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించి, దర్యాప్తును దెబ్బ తీసే ఉద్దేశంతో చర్చిలో దోపిడీకి పాల్పడినట్లు చెబుతున్నారు. తాము దర్యాప్తును కొనసాగిస్తున్నామని, ఇప్పటి వరకు తాము సేకరించిన సమాచారం ప్రకారం పెద్ద కుట్ర జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయని సిబిఐ వర్గాలు వన్ ఇండియా ప్రతినిధితో చెప్పారు. ముఠాలోని చాలా మంది బంగ్లాదేశ్కు చెందినవారని, దేశాన్ని చిక్కుల్లో పడేసే ఉద్దేశంతో వారిని గుర్తు తెలియని వ్యక్తి చేరదీసినట్లు చెబుతున్నారు.
కోల్కతాలో దర్యాప్తు చేస్తున్న సిఐడి కూడా ఈ కేసులో భారీ కుట్ర కోణాన్ని వెలికి తీసినట్లు చెబుతున్నారు. ఈ కేసులో మూడు బృందాలు పాలు పంచుకున్నాయని, వీటిలో ఓ జట్టు బంగ్లాదేశ్కు చెందింది కాగా మరో రెండు జట్లు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవని సిఐడి గుర్తించినట్లు సమాచారం. ఆసక్తికరంగా సంఘటన జరగడానికి ముందు, జరిగిన తర్వాత నిందితుల సెల్ఫోన్ కాల్స్ బంగ్లాదేశ్కు చెందినవే. దీన్నిబట్టి మొత్తం వ్యవహారం బంగ్లాదేశ్ నుంచి నడిచినట్లు సిఐడి వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటి వరకు విచారించిన సాక్షులు, అరెస్టయిన నిందితులు చెప్పిన విషయాల ప్రకారం బంగ్లాదేశ్లో కుట్ర జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ కుట్రను అమలు చేయడానికి వారు భారతదేశంలోని ఎవరితోనైనా నిత్య సంబంధాల్లో ఉన్నారా అనేది ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. ఈ విషయంలో సిబిఐ మరింత ముందుకు వెళ్లి బంగ్లాదేశ్ అధికారులను సంప్రదించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
భారతదేశాన్ని ఇబ్బందుల్లో పెట్టే ఉద్దేశంతో ఈ కుట్ర జరిగినట్లు దాదాపుగా నిర్ధారణ అయిన విషయమే అయినా భూమి వ్యవహారాలకు సంబంధించిన కోణం ఏదైనా ఉందా అనే దిశగా సిబిఐ అధికారులు ఆలోచన చేస్తున్నారు. తన ఉద్దేశానికి భిన్నంగా కొంత భూమిని విక్రయించాలనే ఒత్తిడి కాన్వెంట్పై పడినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో కాన్వెంట్ ఆధీనంలో ఉన్న భూమికి సంబంధించిన పత్రాలను ఇవ్వాలని దర్యాప్తు అధికారులు ఆదేశించారు. భారతదేశాన్ని చిక్కుల్లో పడేయడంతో పాటు కాన్వెంట్ భూమిని స్వాధీనం చేసుకోవాలనే కుట్ర సంఘటన వెనక దాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ భూమి కోటి రూపాయలకు పైగా విలువ చేస్తుంది.
బంగ్లాదేశ్ నుంచి కుట్ర జరిగిందనే విషయం వెల్లడైన నేపథ్యంలో సిబిఐ బంగ్లాదేశ్ సహకారం కోరే అవకాశం ఉంది. ఇంటర్పోల్ సహకారాన్ని కూడా భారదేశం ఆశించే అవకాశం ఉంది. ఈ కేసులోని నిందితుల్లో కొంత మంది దేశం విడిచి పారిపోయిట్లు భావిస్తున్నారు. దాంతో నిందితులను పట్టుకోవడానికి సిబిఐ ఇంటర్పోల్ సహాయాన్ని కోరనుంది.