నన్ రేప్: ప్రధాన సూత్రధారి అరెస్ట్, ఇద్దరి కోసం వేట
కోల్కతా: నన్(క్రైస్తవ సన్యాసిని) సామూహిక అత్యాచార కేసులో ప్రధాన సూత్రధారి నజ్రుల్ ఇస్లాం అలియాస్ నోజుల్ను పశ్చిమబెంగాల్ సిఐడి అరెస్ట్ చేసింది. దోపిడీకి చేసేందుకు రెహమాన్ అనే వ్యక్తితోపాటు వచ్చిన నోజుల్, మరో ఇద్దరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
సెల్దా రైల్వే స్టేషన్లో నజ్రుల్ను అరెస్ట్ చేసినట్లు సిఐడి తెలిపింది. రాష్ట్ర ఇంటెలీజెన్స్ వర్గాలు తెలిపిన వివరాల మేరకు ప్లాట్ ఫాం నెంబర్ 5 వద్ద అతడ్ని సిఐడి అదుపులోకి తీసుకుంది.
దాడి వెనుక:
నజ్రుల్, రెహమాన్, మరో ఇద్దరు కలిసి దోపిడీకి ప్రయత్నించారని సిఐడి తెలిపింది. ఈ దోపిడీకి ప్రణాళిక మొత్తం బంగ్లాదేశ్లో జరిగిందని, స్థానికుల సహాయం కూడా నిందితులు తీసుకున్నారని పేర్కొంది. క్రిస్టియానిటీని ధ్వేషిండమే ఈ ఘాతుకానికి కారణమని మొదట భావించినప్పటికీ.. దోపిడీ పాల్పడేందుకు వారు వచ్చినట్లు సిఐడి తమ విచారణలో తేల్చింది.
‘మేము కాన్వంట్లో దోపిడీకి వచ్చాం. అయితే తాము దోపిడీ చేస్తున్న విషయాన్ని గమనించిన నన్.. మమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాం' అని నిందితులు తెలిపినట్లు సిఐడి పేర్కొంది.
నన్ రేప్ కేసులో నజ్రుల్ అరెస్ట్తో అరెస్టయిన నిందితుల సంఖ్య ఆరుకు పెరిగింది. రెహమాన్ ఇప్పటికే సిఐడి కస్టడీలో ఉన్నాడు. కేసులో మరిన్ని నిజాలు రాబట్టేందుకు నరూల్తో రెహమాన్ను కలిసి సిఐడి విచారించనుంది. ఈ ఘటనకు సహకరించిన మరింత మంది నిందితుల వివరాలను వారి నుంచి రాబట్టేందుకు సిఐడి ప్రయత్నిస్తోంది.
దోపిడీ, నన్ రేప్ ఘటనలో మొత్తం 8మంది పాల్గొన్నట్లు సిఐడి అధికారులు చెబుతున్నారు. మరో ఇద్దరు నిందితులైన సలీం, తుహిన్లు ముంబైలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ ఇంకా మనదేశంలోనే ఉన్నారని, బంగ్లాదేశ్ వెళ్లలేదని చెప్పారు.
కాగా, జూన్ చివరి వరకు ఛార్జీ షీటు నమోదు చేస్తామని సిఐడి అధికారులు చెబుతున్నారు. న్యూఢిల్లీలో ఉన్న బాధిత నన్ నుంచి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు సిఐడి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో నన్ నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తామని చెప్పారు.