లేడీ కాదు కిలేడీ.. తిన్నింటి వాసాలు లెక్కగట్టింది, ఎందుకో తెలుసా..!!
న్యూఢిల్లీ : కలికాలం అంటే ఇదేనెమో.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం, దగ్గరి బంధువులపై లైంగికదాడులు చేయడం, లేదంటే హత్యలు చేసి బీభత్సానికి గురిచేస్తున్నారు కొందరు. నిత్యం ఎక్కడో ఓ చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఘటన కలకలం రేపింది. ఇదివరకు కేర్ టేకర్గా పనిచేసిన యువతి .. తన యాజమాని కుమారుడినే కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. అయితే పోలీసులు కంప్లైంట్ చేయడంతో ఆ కిలేడీ ఆట కట్టించారు పోలీసులు.
నయవంచన ..
యూపీలోని మథురకు చెందిన నస్రీన్ అలియాస్ ఫిజా ఖాన్ కడు పేదరికం నుంచి వచ్చారు. ఆమెకు ఏడుగురు సోదరులు, సోదరీలు ఉన్నారు. ఆమె తండ్రి ఒక్కడి సంపాదనే ఆదాయ మార్గం. ఆమె ఎలాగోలా డిగ్రీ వరకు చదివింది. తర్వాత పై చదువుల కోసం తండ్రి డబ్బు సమకూర్చలేకపోయాడు. దీంతో ఢిల్లీకి మకాం మార్చింది. సెక్టార్ 14లో గల ఓ వ్యాపారి ఇంట్లో కేర్ టేకర్గా పనిచేసింది. అంతవరకు తన పని తాను చేసుకున్న నస్రీన్ మనసును .. టీవీలో వచ్చిన సీరియల్ ప్రభావం చూపింది. తన పై చదువుల కోసం వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేయాలని భావించింది.
కిడ్నాప్ యత్నం ...
ఇందుకోసం ముస్తాకీమ్ ఖాన్ అనే వ్యక్తిని సంప్రదించింది. అతనిది కూడా యూపీయే .. కానీ ఢిల్లీలో జ్యూస్ విక్రయిస్తుంటాడు. తన ప్లాన్ గురించి తెలిపింది. సహకరిస్తే అందుల్లోంచి రూ.20 లక్షలు ఇస్తానని చెప్పడంతో అతడు డబ్బులకు ఆశపడి అంగీకరించాడు. సెక్టార్ 14లో ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేసే, తన పాత యాజమానిని టార్గెట్ చేశారు. తన పై చదువుల కోసం డబ్బులు అవసరమవుతాయని .. రూ.కోటి డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో రూ.20 లక్షలు మాత్రం ఖాన్ను ఇస్తానని మాటిచ్చింది. ఇంకేముంది వ్యాపారి 11 ఏళ్ల కుమారుడిని అబ్జర్వ్ చేయడం మొదలెట్టారు.
ఫోన్ చేసి బెదిరింపులు ..
ఇద్దరు సిమ్ కార్డులు సమకూర్చుకొని .. వ్యాపారికి ఫోన్ చేయడం మొదలెట్టారు. తొలుత ఫోన్ చేయగా వ్యాపారి పట్టించుకోలేదు. కానీ ఈ నెల 8న పదే పదే ఫోన్ రావడంతో అనుమానం వచ్చింది. కిడ్నాపర్ ఫోన్ చేసి రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే కుమారుడిని కిడ్నాప్ చేసి హతమారుస్తామని బెదిరించారు. కిడ్నాప్నకు ఫిజా ఖాన్ (నస్రీన్) నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. నస్రీన్ అంటే తెలుస్తోందని పేరు మార్చారు. తర్వాత మూడురోజుల్లో 20 సార్లు ఫోన్ చేయడంతో సెక్టార్ 14 పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. వరుసగా వస్తోన్న ఫోన్లను ట్రేస్ చేసి .. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తన పై చదువుల కోసమే నస్రీన్ కిడ్నాప్ అంటూ బెదిరించారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.