డబుల్ మర్డర్: నర్సింగ్ విద్యార్థిని, ఆమె సోదరి దారుణ హత్య: పెనంతో తలపై మోది.. !
రాయ్ పూర్: వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతంలో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తరువాత కూడా మహిళలు, విద్యార్థినులపై ఘాతుకాలు ఆగట్లేదు. తన సోదరితో కలిసి పేయింగ్ గెస్ట్ గా నివసిస్తోన్న ఓ నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యారు. అడ్డొచ్చిన నర్సింగ్ విద్యార్థిని సోదరిని కూడా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
డబ్బుల కోసం గ్యాంగ్ రేప్ నాటకం: టోల్ గేట్ వద్దే: అచ్చం దిశ తరహాలోనే..!
మృతుల పేర్లు మనీషా సిదార్, మంజులత. రాయ్ పూర్ సిటీలోని టికారాపూర్ గోదావరి కాలనీలో ఓ మూడంతస్తుల హోటల్ లో మనీషా నివసిస్తున్నారు. కోర్బా జిల్లాకు చెందిన ఆమె రాయ్ పూర్ లో నర్సుగా శిక్షణ పొందుతున్నారు. పేయింగ్ గెస్ట్ గా ఉంటూ నర్సింగ్ చదువుతున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో నర్సింగ్ విద్యార్థిని సోదరి పీజీ హోటల్ లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు వారిని దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటనలో మొత్తం ఇద్దరు వ్యక్తులు పాల్గొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నర్సింగ్ విద్యార్థినిపై దాడి చేయడానికి వారు వచ్చి ఉంటారని, ఆమె సోదరి ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. ఇద్దర్నీ హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలు లభించిన వారి గదిలో పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకున్నట్లు ఆనవాళ్లు కనిపించినట్లు రాయ్ పూర్ సిటీ ఎఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు.
హత్య చేయడానికి నిందితులు కూరగాయలు తరిగే కత్తి, పెనం ఉపయోగించి ఉంటారని చెప్పారు. కత్తి, పెనంపై రక్తపు మరకలు ఉన్నాయని అన్నారు. హత్య చోటు చేసుకున్న కొంత సేపటి తరువాత.. పీజీ హోటల్ నుంచి ఇద్దరు యువకులు పరుగెత్తు కుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని, వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలను అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు.