దుర్గా పూజలో నుస్రత్ జహాన్: పేరు మార్చుకోమంటూ మత పెద్దల ఆగ్రహం
కోల్కతా: ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నూస్రత్ జహాన్ తన భర్త, పారిశ్రామిక వేత్త అయిన నిఖిల్ జైన్తో కలిసి దుర్గా మాత పూజలో పాల్గొని సందడి చేశారు. బెంగాల్లో జరుగుతున్న దసరా వేడుకల్లో ఎంపీ అయిన తర్వాత తొలిసారి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సాంప్రదాయ దుస్తుల్లో ఈ జంట దుర్గాదేవికి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సంగీత వాయిద్యమైన ధాక్ కూడా వాయించి అక్కడున్నవారిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నృత్యాలు కూడా చేసింది ఈ జంట. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నిఖిల్ జైన్లో తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే, ముస్లిం అయి ఉండి ఇలా దుర్గామాత పూజలో పాల్గొనడంపై ఆ మత పెద్దలు కొందరు నుస్రత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పేరు మార్చుకుని ఉత్సవాల్లో పాల్గొనవచ్చని, ఇలా ముస్లింగా ఉండి తమ మతాన్ని కించపర్చవద్దని మండిపడుతున్నారు.
కాగా, దుర్గా మాత ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా నుస్రత్ జహాన్ మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మనమంతా బెంగల్ కుటుంబంలో భాగమని చెప్పుకొచ్చారు.
ఇటీవల పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు నుస్రత్ జహాన్ దంపతులు దుర్గా పూజలో పాల్గొన్నారు. బషిర్హత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా తొలిసారి విజయం సాధించారు నుస్రత్. ఆ తర్వాత ఆమె కోల్కతాకు చెందిన పారిశ్రామికవేత్త నిఖిల్ జైన్ను వివాహం చేసుకున్నారు.