లక్ష్యం చేరలేకపోతున్న కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం "న్యాయ్" !? ఇంకా మోడీవైపే జనం తేల్చిన తాజా సర్వే
బెంగళూరు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓటమి గండం నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్ పార్టీ సంధించిన బ్రహ్మాస్త్రం న్యాయ్ పథకం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికీ కనీస ఆదాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆ పార్టీ రూపొందించిన పథకం ఇది. ఈ పథకం కూడా కాంగ్రెస్ పార్టీ కష్టాలను తీర్చేలా కనిపించట్లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోెంది. లోక్ నీతి-సీఎస్డీఎస్ చేసిన సర్వేలో.. ఈ విషయం స్పష్టమైంది. న్యాయ్ పథకం అనే ఒకదాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందనే విషయమే మెజారిటీ జనాలకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తుందనే విషయం తమకు ఇప్పటిదాకా తెలియదని 52 శాతం మంది తెలిపారు. రాహుల్ గాంధీ ఈ పథకాన్ని ప్రకటించిన అంశం తమకు తెలుసని, దీనిపై కొంత అవగాహన ఉందని మిగిలిన 48 శాతం మంది అభిప్రాయపడినట్లు లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వే వెల్లడించింది.
సర్వే.. స్థూలంగా ఇలా!
లోక్ నీతి-సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) సంయుక్తంగా ఈ సర్వే చేపట్టాయి. మార్చి 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో సర్వే కొనసాగింది. ఏపీ, తెలంగాణ సహా అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో సర్వే కొనసాగింది. మొత్తం 10,010 మంది అభిప్రాయాలను సర్వే ప్రతినిధులు సేకరించారు. 101 అసెంబ్లీ సెగ్మెంట్లలో వివిధ వర్గాలకు చెందిన ఓటర్లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఏపీలో నాలుగు నియోజకవర్గాల్లో 16 పోలింగ్ కేంద్రాల పరిధిలో 390 మంది ఓటర్లను కలిశారు. అలాగే తెలంగాణలో మూడు స్థానాల్లో 12 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 297 మంది ఓటర్లను కలిసి, వారి అభిప్రాయాలను సేకరించారు.
48 శాతం మందికి న్యాయ్ గురించి తెలియదు..
లోక్ నీతి-సీఎస్డీఎస్ ప్రతినిధులు మొత్తం 10,010 మంది అభిప్రాయాలను సేకరించగా.. వారిలో 48 శాతం మందికి న్యాయ్ పథకం గురించి తెలియదని, దీని పేరే వారు వినలేదని తేలింది. న్యాయ్ పథకం గురించి తెలియని వారిలో 21 శాతం మంది ఓటర్లు.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకోగా, 44 శాతం మంది ప్రజలు నరేంద్రమోడీ వైపే మొగ్గు చూపడం విశేషం. న్యాయ్ పథకంపై కొద్దో, గొప్పో అవగాహన ఉన్న వారిలో 28 శాతం మంది ప్రజలు ప్రధానిగా రాహుల్ గాంధీని ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో- వారిలో 42 శాతం మంది మోడీ అభ్యర్థిత్వాన్నే సమర్థించడం కొసమెరుపు.
కనీస ఆదాయం రూ.20,000 పైమాటేనంటోన్న మెజారిటీ ప్రజలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. న్యాయ్ పథకం కింద కనీస ఆదాయాన్ని ఎంత వరకు కల్పిస్తారనే విషయంపైనా ప్రజల్లో స్పష్టమైన అవగాహన లేదు. ప్రతినెలా కనీస ఆదాయ మొత్తాన్ని 20 వేల రూపాయలకు పైగా కల్పిస్తారని అభిప్రాయ పడే వారి శాతం 55. 3000 రూపాయల వరకు ఇస్తారని 44 శాతం మంది, 3001 నుంచి 5000 రూపాయల వరకు కల్పించే అవకాశం ఉందంటూ 39 శాత మంది అభిప్రాయపడ్డారు. 5001 నుంచి 10,000 రూపాయల వరకు ఇస్తారని 48 శాత మంది ఓటర్లు భావిస్తున్నారు. అలాగే- 10,001 నుంచి 15,000 వరకు కనీస ఆదాయాన్ని కల్పిస్తారని 49 శాతం మంది భావిస్తుండగా, మరో 49 శాతం మంది ఓటర్లు తమకు 15,001 నుంచి 20,000 రూపాయల వరకు కనీస ఆదాయ పథకాన్ని వర్తింపజేస్తారనే నిర్ణయానికి వచ్చారు.
క్షేత్రస్థాయికి చేరని న్యాయ్ పథకం..
దీన్ని బట్టి చూస్తే- కనీస ఆదాయ పథకాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పేరుతో కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో ఆ పార్టీ శ్రేణులు విఫలం అయ్యారనే విషయం కూడా ఈ సర్వే ద్వారా తేటతెల్లమౌతోంది. తొలి దశ పోలింగ్ గడువు సమీపించింది. మరో రెండు రోజుల్లో తొలిదశ పోలింగ్ జరుగనుంది. దానకి 48 గంటల ముందే ఎన్నికల ప్రచారం పరిసమాప్తం అవుతుంది.
న్యాయ్ పైనే కాంగ్రెస్ జయాపజయాలు..
ఈ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైన న్యాయ్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చేతులెత్తేసిందని సర్వే స్పష్టం చేస్తోంది. గ్రామ స్థాయిలో ఈ పథకాన్ని తీసుకెళ్లి, ప్రజల్లో అవగాహనను కల్పించలేకపోయిందని చెప్పుకోవచ్చు. న్యాయ్ పథకం గురించి తెలియని వారితో పోల్చుకుంటే ప్రధానిగా రాహుల్ గాంధీని కోరుకునే వారి శాతంలో పెరుగుదల కనిపించడం విశేషం. రాహుల్ గాంధే ప్రధానిగా మోడీనే బెస్ట్ అని అభిప్రాయపడే వారి శాతంలో కూడా క్షీణత కనిపించింది. దీనితో- న్యాయ్ పథకం కాంగ్రెస్ కు మేలు చేస్తుందని భావించడానికి ఆస్కారం ఉంది. క్షేత్ర స్థాయిలో విజయవంతంగా తీసుకెళ్లడంలోనే కాంగ్రెస్ పార్టీ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు.