శబరిమలలో ఉద్రిక్తత: న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టుపై దాడి, రాష్ట్ర వ్యాప్త బంద్
తిరువనంతపురం: అన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశం అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శబరిమలలో గురువారం కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శబరిమల కొండను ఎక్కేందుకు ప్రయత్నించిన న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టు సుహాసిని రాజ్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసుల సహాయంతో ఆమె కొంత దూరం వెళ్లినప్పటికీ.. ఆందోళనకారులు రోడ్డును బ్లాక్ చేశారు.
శబరిమలలో ఉద్రిక్తత: ఏపీ మహిళకు ఆందోళనకారుల బెదిరింపు, వెనక్కి తప్పలేదు
రాళ్లు విసిరిన ఆందోళనకారులు
రహదారికి అడ్డంగా నిలబడి ఆమెపై రాళ్లదాడికి పాల్పడ్డారు. అసభ్యకరంగా తిడుతూ శబరిమలలోకి ప్రవేశానికి అనుమతించబోమంటూ ఆందోళనకు దిగారు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ సుహాసినితో పాటు విదేశీ పాత్రికేయురాలు కూడా ఉంది. దీంతో చేసేదేమి లేక ఆమె పంబకు వెనుదిరిగారు.
శబరిమల ఆలయంలో పూజలు: మహిళల అడ్డగింత, పోలీసుల లాఠీచార్జీ, ఉద్రిక్తత
నిన్న వెనక్కి వచ్చిన ఏపీ మహిళ
కాగా, శబరిమల కొండను ఎక్కేందుకు ప్రయత్నించిన మూడో మహిళ సుహాసిని. బుధవారం ఆంధ్రప్రదేశ్కు చెందిన మాధవితో పాటు కేరళకు చెందిన పాత్రికేయురాలు లిబిని కూడా ఆందోళనకారులు ఇదే విధంగా వెనక్కి పంపించారు.
24గంటల బంద్
ఆలయంలోకి మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ప్రవీణ్ తొగాడియా అంతరాష్ట్రీయ హిందూ పరిషత్, శబరిమల సంరక్షణ సమితి, ఆర్ఎస్ఎస్.. కేరళలో 24గంటల బంద్కు పిలుపునిచ్చింది. కొజికోడ్, అటింగళ్, ఛెథ్రాల ప్రాంతాల్లో కేఎస్ఆర్టీసీకి చెందిన బస్సులపై ఆందోళనకారులు రాళ్లదాడికి దిగారు. బంద్లో భాగంగా కేరళలోని అన్ని దుకాణాలను మూసివేశారు.
భారీగా మోహరించిన పోలీసులు.. మహిళల అడ్డగింత
కాగా, రాష్ట్ర బీజేపీ నేతలు బంద్కు మద్దతుగా నిరసనలు చేపట్టారు. బంద్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా పోలీసు బలగాలు భారీ ఎత్తున మోహరించాయి. బుధవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్న విషయం తెలిసిందే. అయితే.. భారీ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మహిళా భక్తులు ఎవరూ ఇప్పటి వరకు ఆలయంలోకి ప్రవేశించలేకపోయారు. బుధవారం మహిళల ప్రవేశం అడ్డుకుంటున్న భక్తులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేసి అరెస్టులు చేశారు.గురువారం కూడా శబరిమల ఆలయం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.