సిద్దూకు ఆ పదవి 'మిస్'!: సీఎంగా అమరీందర్ సింగ్ ప్రమాణస్వీకారం..
సిద్దూకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారని అంతా భావించినప్పటికీ.. ఆయనకు ఆ పదవి దక్కలేదు.
చండీగఢ్: పంజాబ్ లో 117సీట్లకు గాను 77సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ నేటి ఉదయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంతకుముందు చెప్పినట్లుగానే సీనియర్ నేత, కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
అమరీందర్ సింగ్ తో పాటు కేబినెట్ మంత్రులుగా మరో 9మంది ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కేబినెట్ మంత్రుల జాబితాలో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సిద్దూ పేరు రెండో స్థానంలో ఉంది.
సిద్దూకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారని అంతా భావించినప్పటికీ.. ఆయనకు ఆ పదవి దక్కలేదు. సిద్దూ బీజేపీని వీడిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ తోనే కాంగ్రెస్ లో చేరినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారం సందర్బంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ పాదాలకు సిద్దూ గౌరవప్రదంగా నమస్కరించారు.
ఇక మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ బంధువు మన్ ప్రీత్ సింగ్ బాదల్ కు సైతం కేబినెట్ లో చోటు దక్కడం గమనార్హం. ఆయన స్థాపించిన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ ను కాంగ్రెస్ లో విలీనం చేయకముందు బాదల్ సర్కార్ లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు.