భారత్ యువతదే, బెస్ట్ పార్ట్నర్: ఒబామా నోట షారుక్ సినిమా డైలాగ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీలోని సిరి ఫోర్టు స్టేడియంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నమస్తే, బహుత్ ధన్యవాద్తో ప్రారంభించిన ప్రసంగాన్ని.. జైహింద్తో ముగించారు. ఆయన మాట్లాడుతూ.. భారత్ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందన్నారు. యువత భారత్కేకాదు.. ప్రపంచానికి దిశదశ చూపగలదన్నారు. 35 ఏళ్ల లోపు వాళ్లే భారత్లో ఎక్కువ అన్నారు.
భారత్, అమెరికా ప్రజల్లో కష్టపడేతత్వం ఎక్కువగా ఉంటుందని, అమెరికా యువత భారత్లో చదువుకునేందుకు ప్రోత్సహిస్తామన్నారు. మతం ఆధారంగా మనుషులను విడదీయలేరని భారత్ నిరూపించిందన్నారు. రెండుసార్లు భారత్ వచ్చిన చివరి అధ్యక్షుడు తాను కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. భారత్ అమెరికాకు మంచి పార్ట్నర్ అన్నారు.
భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నందుకు గర్విస్తున్నానని చెప్పారు. 2010లో భారత్ వచ్చినప్పుడు దీపావళి వేడుకల్లో పాల్గొన్నానని, అప్పుడు తన కన్నా మిచెల్లీ ఒబాబా బాగా డ్యాన్స్ చేశారన్నారు. తాను దృఢచిత్తం కలిగిన, తెలివిగల యువతిని పెళ్లి చేసుకున్నానని మిచెల్లీ ఒబామాను ఉద్దేశించి అన్నారు.
తన మనసులో ఏం అనుకుంటున్నారో అది చెప్పేందుకు లేదా దానిని తనకు చెప్పేందుకు మిచెల్లీ ఎప్పుడు కూడా భయపడరన్నారు. తాను పొరపాటు చేసిన సమయాల్లో దానిని చెప్పేందుకు ఆమె వెనుకాడరన్నారు. తన రంగుకు భిన్నంగా తనను ట్రీట్ చేశారని నవ్వుతూ చెప్పారు.
స్వామి వివేకానంద అమెరికాకు హిందుత్వాన్ని, యోగాను పరిచయం చేశారన్నారు. 30 లక్షల మంది భారతీయులు తమ దేశాన్ని బలోపేతం చేస్తున్నారని, అది ఎంతో గర్వకారణమన్నారు. మిల్కా సింగ్ ఒలింపిక్ పతకాలను, కైలాష్ సత్యార్థి నోబెల్ బహుమతులను, షారుక్ ఖాన్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రం విజయాన్ని ఒబామా ప్రస్తావించారు. ఈ చిత్రంలోని డైలాగ్ను కూడా చెప్పారు. సెనోరిటా బడేబడే దేశంమే అనే డైలాగ్ చెప్పారు.
భారత్లోను, అమెరికాలోను అనేక జాతులు, మతాలు, కులాలు, వర్ణాలు ఉన్నాయన్నారు. తన తాత బ్రిటిష్ సైన్యంలో వంటవాడిగా పని చేసేవారని, తాము పుట్టినప్పుడు నల్ల జాతికి ఓటు హక్కు ఉండేది కాదని, తన చర్మం రంగు కారణంగా అసలు ఇంత ఎత్తు ఎదగగలనా అన్న అనుమానం చాలామందికి ఉండేదన్నారు.
ఇప్పుడు ఇక్కడ ఒకరు ఆటో నడుపుతుంటారని, మరొకరు ఇంట్లో పని చేసుకుంటారని, వాళ్లకూ ఆశలు, ఆకాంక్షలు ఉంటాయన్నారు. ఓ టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కావడమే అందుకు నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరు తన కలలను నిజం చేసుకోవడానికి కష్టపడాలన్నారు. రిపబ్లిక్ వేడుకల్లో నారీ శక్తి తనను ఆకట్టుకుందన్నారు.
హిందువులు, ముస్లీంలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, యూదులు.. అంతా ఉంటారని, కానీ అంతా ఒకే చెట్టుకు ఉన్న వేర్వేరు కొమ్మల్లాంటివారేనని, మతస్వేచ్ఛ దేశానికి ముఖ్యమన్నారు. అమెరికా, భారత్.. ఈ రెండు దేశాల్లో అది ఉందని చెప్పారు. భారత్లో వ్యవస్థ చాలా బాగుందన్నారు.
విశాల్ను పరిచయం చేసిన ఒబామా
బరాక్ ఒబామా బాలకార్మికుడు విశాల్ (16) ఏళ్ల యువకుడిని ఈ సందర్భంగా పరిచయం చేశారు. 2010లో వచ్చినప్పుడు అతనిని కలిశారు. విశాల్ టాలెంట్ యూత్కు మంచి నిదర్శనమన్నారు.
జైహింద్ అంటూ ఒబామా తన ప్రసంగాన్ని ముగించారు. మిచెల్లీ ఒబామా, నోబెల్ శాంతిబహుమతి పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి, సామాజిక కార్యకర్తలు, యువత ఇందులో పాల్గొన్నారు ఒమాబాతో కరచాలనం చేసేందుకు చాలామంది పోటీ పడ్డారు.