పటేల్ ర్యాలీలో ఉద్రిక్తత: ఏంజరిగినా ప్రభుత్వానిదే బాధ్యత
న్యూఢిల్లీ: గుజరాత్లో పటేల్ సామాజిక వర్గానికి చెందిన ప్రజల సమస్యలను పరిష్కరించకుంటే, 2017లో బీజేపీకి ఇబ్బందులు తప్పవని పటిదార్ అరక్షన్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ హెచ్చరించారు.
మంగళవారం దాదాపు 8-9 లక్షల మంది పటేల్ వర్గం ప్రజలు వెంటరాగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ జీఎండీసీ మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ దాదాపు 5 కిలోమీటర్ల మేర 'మహా క్రాంతి ర్యాలీ' పేరుతో పాదయాత్రగా వెళ్లారు.
అనంతరం హార్దిక్ పటేల్ తన వర్గం వారిని ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. "మన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే 2017లో కమలం వికసించదు" అని ఆయన అన్నారు. "మనమంతా సర్దార్ పటేల్ వారసులం. సాంఘికంగా, సామాజికంగా మనం ఎదగాల్సిన సమయం వచ్చింది. మనకు రిజర్వేషన్లు ఇచ్చేంత వరకూ ఈ పోరాటం ఆగదు"అని అన్నారు.
గుజరాత్లో బీజేపీకి కీలక ఓటుబ్యాంకుగా ఉన్న పటేల్ వర్గంలో ఇటీవలే వెలుగులోకి వచ్చిన హార్దిక్ పటేల్ తన వర్గంపై మంచి పట్టు సాధించారు. పటేళ్ల వర్గాన్ని ఓబీసీల్లో చేర్చాలంటూ 22ఏళ్ల హార్దిక్ పటేల్ అనే యువకుడి ఆధ్వర్యంలో అహ్మాదాబాద్లో తలపెట్టిన ఈ పటేల్ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దీంతో పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఆందోళన కారులపై బాష్పవాయువు ప్రయోగించారు. దీనిపై హార్దిక్ పటేల్ స్పందిస్తూ పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలని తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకున్నారన్నారు. లాఠీ చార్జి చేస్తున్నారని ఎవరికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.