చట్టాన్ని గౌరవిస్తా .. దర్యాప్తు సంస్థలు కూడా గౌరవించాలి ... నిమిషాల్లోనే మారిన పరిస్థితి
న్యూఢిల్లీ : చట్టాన్ని గౌరవిస్తా .. దర్యాప్తు సంస్థలు కూడా గౌరవించాలి అని మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ప్రసంగించిన కాసేపట్లోనే పరిస్థితి మారిపోయింది. తాను చట్టాన్ని గౌరవిస్తానని ప్రకటించి ఇంటికి చిదంబరం వెళ్లిపోయారు. ఇక అక్కడి నుంచి ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. చిదంబరం ఇంటికి పోలీసులు, ఈడీ, సీబీఐ అధికారులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు, కార్యకర్తలు, అభిమానులు చేరుకోవడంతో అక్కడ ఏ జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.
వారెంట్తో సీబీఐ, ఈడీ ..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంపై అరెస్ట్ వారెంట్తో సీబీఐ, ఈడీ నోటీసులు జారీచేశాయి. లుక్ ఔట్ నోటీసులు కూడా ఇచ్చాయి. నిన్న ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో హై టెన్షన్ నెలకొంది. 24 గంటల తర్వాత మీడియా ముందుకొచ్చిన చిదంబరం .. తన పాత్రేం లేదని తేల్చిచెప్పారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ తాను పారిపోలేదని పేర్కొన్నారు. న్యాయ నిపుణులతో చర్చించానని .. ఓ దేశ పౌరుడిగా బాధ్యతతో మెలుగుతానని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవిస్తానని పారిపోనని స్పష్టంచేశారు. కానీ ఆయన ఇంటికివెళ్లిన క్షణాల్లోనే సీబీఐ, ఈడీ అధికారులు రంగంలోకి దిగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. పోలీసులను కూడా భారీగా మొహరించారు. పోలీసుల సాయం కోరండంతో 20 మంది పోలీసులు రంగంలోకి దిగారు.
ట్విస్టుల మీద ట్విస్టులు ..
సినిమా ట్విస్టులను తలదన్నిన ఐఎన్ఎక్స్ ఎపిసోడ్ ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చింది. నిన్నటి నుంచి నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రత్యక్షమయ్యారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ నోటీసులు, లుక్ ఔట్ నోటీసులు జారీచేయడంతో ఉత్కంఠ నెలకొన్నది. దీంతో నిన్నటి నుంచి చిదంబరం ఆజ్ఞాతంలో ఉన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ లభించకపోవడంతో .. చివరికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు చిదంబరం. ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
నాకే సంబంధం ..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, చార్జీషీట్లో తనపేరు లేదని పేర్కొన్నారు. ముడుపులకు సంబంధించి ఆరోపణలు లేవని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘటనలో తనను ఇరికించడం ఏంటీ అని ప్రశ్నించారు. ఈ కేసులో తనకు నోటీసులు ఇవ్వడంపై నిన్నటి నుంచి తన లాయర్లతో సంప్రదింపులు జరిపానని పేర్కొన్నారు. తానేం తప్పుచేయలేదని .. ఎవరికీ భయపడబోనని తేల్చిచెప్పారు. ఓ పౌరుడిగా తిరిగే అధికారం తనకు ఉందని వివరించారు. చట్టాన్ని గౌరవిస్తానని .. దర్యాప్తు సంస్థలు కూడా చట్టాన్ని గౌరవించాలని కోరారు.