ఇకపై ఓసీఐ కార్డుదారులకు ప్రత్యేక అనుమతి తప్పనిసరి: కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: ఇకపై ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు మనదేశంలో చేసే మిషనరీలు, తబ్లిఘ్, పాత్రికేయ కార్యకలాపాలకు ముందుగా భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పస్టం చేసింది. ఇతర దేశాల పాస్ పోర్టులు కలిగివున్న విదేశీయులకు భారత్లో కొన్ని ప్రత్యేక అనుమతులు ఇస్తూ ఓసీఐ కార్డులను జారీ చేస్తారు.
ఓసీఐ కార్డుదారులకు భారత పౌరులతో సహా అన్నింటిలో సమాన అవకాశాలుంటాయి. దేశంలో జరిగే ప్రవేశ పరీక్షలు, జాతీయ చిన్నారుల దత్తత స్వీకారం వంటి వాటిల్లో వారికి అవకాశం కల్పిస్తుంది. కానీ, ప్రస్తుతం హోంశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇకపై ఓసీఐ కార్డుదారులు ఏవైనా సామాజిక, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించినా.. నిషేధించిన ప్రదేశాలకు వెళ్లాలనుకున్న భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
భారతదేశంలో పర్యటించడానికి తప్పనిసరిగా ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, గత మార్చిలో దేశమంతా లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో సుమారు 2500 మందికిపైగా తబ్లిఘీ జమాత్ సభ్యులు ఢిల్లీలోని నిజాముద్దీన్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.
కరోనా ఆంక్షలు ఉల్లంఘించి నిర్వహించిన ఈ సమావేశంలో చాలా మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, ఈ సమావేశంలో పాల్గొన్నవారంతా దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్లడంతో అక్కడ కూడా కరోనా వ్యాప్తి జరిగింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనకు సంబంధించి 233 మంది విదేశీ తబ్లిఘీ కార్యకర్తలను ఆ సమయంలో అరెస్ట్ చేసింది.