తుపాను దెబ్బ: తేరుకుంటున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు ఎఫెక్ట్!
చెన్నై/ తిరువనంతపురం: ఓఖీ తుపానుతో దెబ్బతిన్న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కన్యాకుమారి జిల్లాలో పర్యటించారు. ఓఖీ తుపాను తమిళనాడు, కేరళను అతలాకుతలం చేసింది.
Recommended Video
తమిళనాడు, కేరళ తరువాత లక్షదీప్ కు వెళ్లి అక్కడ కూడా తీవ్ర విధ్వంసం సృష్టించింది. వేల సంఖ్యలో ఇళ్లు, కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో పడవలు కూడా ధ్వంసం అయ్యాయి. ఇప్పుడు గుజరాత్, మహారాష్టా తీరాల వైపుకు ఓఖీ తుపాను వెళ్లింది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
ఓఖీ విలయతాండవం చేసిన తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. కేరళకు చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ పలు ప్రాంతాలు పరిశీలించారు. అక్కడి ప్రజలు, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
నిర్మలా సీతరామన్, పన్నీర్ సెల్వం !
కన్యాకుమారికి చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రులు, రక్షణ దళాలు, విపత్తుల నిర్వహణ విభాగం అధికారులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు.
ఎంత నష్టం జరిగింది !
కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మాలా సీతారమన్ తో పాటు కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ పర్యటించారు. కన్యాకుమారి జిల్లాలో ఓఖీ తుపాను కారణంగా ఎంత నష్టం జరిగింది అనే పూర్తి సమాచారాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారు.
ఊపిరి పీల్చుకున్న ప్రజలు
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా, కేరళలో ప్రస్తుతానికి స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఓఖీ తుపాను మిగిల్చిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల కోసం భారత నావీకా దళం, వైమానిక, సముద్ర తీర గస్తీ దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
ఓఖీ ప్రభావం తగ్గింది
కన్యాకుమారి జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్య సంఖ్యలో రంగంలోకి దిగి పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ ఓఖీ ప్రభావం తమిళనాడు, కేరళలో తగ్గిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కు ఎఫెక్ట్ !
ఓఖీ తుపానుకు మరో తుపాను (సాగర్ తుపాను) తోడు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖా అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
రెండు జిల్లాలు, 30 శిభిరాలు !
తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో సహాయక చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. 357 మంది మత్స్యకారులు, 20 పడవలను ఒడ్డుకు చేర్చినట్లు అధికారులు వెల్లడించారు. సముద్రంలో గల్లంతు అయిన వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
2 వేల మంది సురక్షితం
తమిళనాడు,కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాకు చెందిన 2, 232 మంది మత్స్యకారులను వివిధ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళాలు రక్షించాయి. ఇప్పటివరకు రక్షించిన వారిని లక్షదీప్, కన్యాకుమారి, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30 శిబిరాల్లో సురక్షితంగా ఉంచారు