దీపావళి ఎఫెక్ట్: మళ్లీ సరి-బేసి విధానం: వచ్చేనెల నుంచి అమలు: ట్రాఫిక్ పోలీసులకు మరిన్ని కష్టాలు?
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి సరి-బేసి విధానాన్ని అమల్లోకి తెచ్చింది అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం. వచ్చే నెల 4 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకుని రానుంది. 15వ తేదీ వరకు కొనసాగుతుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా.. సరి సంఖ్యలో అంతం అయ్యే రిజిస్టేషన్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను ఒకరోజు, బేసి సంఖ్యతో అంతం అయ్యే నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను ఇంకోరోజు రోడ్లపై తిరగడానికి అనుమతి ఇస్తారు. 10 రోజుల పాటు ఈ విధానాన్ని అమలు చేసిన తరువాత వాయు కాలుష్య పరిమాణాన్ని, పరిణామాలను పరిశీలించి.. దీన్ని కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో సరి-బేసి వాహన రిజిస్ట్రేషన్ల నంబర్ల విధానాన్ని అమల్లోకి తీసుకుని రావడం ఇది మూడోసారి.
నీరవ్ మోడీ సోదరుడి కోసం ఇంటర్ పోల్ వల: రెడ్ కార్నర్ నోటీసులు
శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు. దీపావళి పండుగ సందర్భంగా దేశ రాజధానితో పాటు పొరుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తారని, దీనివల్ల వెలువడే వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి సరి-బేసి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల విధానాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. సాధారణంగా నవంబర్ లో న్యూఢిల్లీలో తోడు దట్టమైన మంచు అలముకుంటుంది. వాహన కాలుష్యం తోడు కావడం, అదే నెలలో దీపావళి పండుగ రావడం.. ఇవన్నీ న్యూఢిల్లీని వాయు కాలుష్య కాసారంగా మార్చేస్తుంటాయి. ఏటా జరిగే తంతే ఇది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమయ్యేంతటి పరిస్థితులు అక్కడ ఉత్పన్నమౌతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహనాల రాకపోకలను అదుపు చేయాలని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. వాహన సంచారాన్ని నియంత్రించడం వల్ల కొంతమేరకైనా వాయు కాలుష్యాన్ని అదుపు చేయడానికి వీలుంటుందని అన్నారు.
వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి స్థానిక ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల నుంచి 1200లకు పైగా సూచనలు, సలహాలు అందాయని, వాటిల్లో ఏడింటిని అమలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై త్వరలోనే ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. అత్యాధునికమైన ఎన్-95 మాస్క్ లను పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని చెప్పారు. అక్టోబర్ నుంచి వాటిని విక్రయానికి ఉంచుతామని అన్నారు. ఢిల్లీలో మొత్తం 12 వార్డుల పరిధిలో అత్యధికంగా వాయు కాలుష్యం వెలువడుతున్నట్లు గుర్తించామని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు అదుపు చేయడానికి పర్యావరణ మార్షల్స్ ను నియమించబోతున్నట్లు తెలిపారు. కొత్త వాహన చట్టం ప్రకారం భారీ చలాన్లను విధిస్తున్న నేపథ్యంలో.. వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత తగ్గుముఖం పట్టిందని కేజ్రీవాల్ చెప్పారు. ఇది కొంత ఊరట కలిగిస్తోందని అన్నారు. ఫిట్ నెస్ లేని, అధిక పరిమాణంలో పొగను వెదజల్లే వాహనాలు రోడ్ల మీద తిరగట్లేదని చెప్పారు.
కాగా- కొత్త వాహన చట్టం ప్రకారం ఢిల్లీ రోడ్ల మీద తిరిగే అన్ని వాహనాలపై నిఘా వేయలేక సతమతమౌతున్నారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు. ఇదే పరిస్థితుల్లో సరి-బేసి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ విధానాన్ని కూడా అమలు చేయడం వల్ల తమ కష్టాలు మరింత పెరుగుతాయని వాపోతున్నారు. తమ పరిస్థితి గోరుచుట్టుపై రోకటి పోటులా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. సరి సంఖ్య గల వాహనాలకు అనుమతి ఉన్న రోజు నాడు బేసి సంఖ్య వాహనాలు రోడ్ల మీద రాకుండా చూడాల్సిన బాధ్యత తమమీదే ఉంటుందని వాయు విహార్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి 10 రోజుల వరకు మాత్రమే సరి-బేసి విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించడం స్వాగతించదగ్గదని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ట్రాఫిక్ సహా అన్ని విభాగాలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.