మోడీ జీ ఉద్యోగాలివ్వండి ..యువత మన్ కీ బాత్ వినండి : ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ ఇదే !!
ఎవరు అధికారంలో ఉన్నా సరే యువతకు పెద్దపీట వేస్తున్నామని , ఉపాధి ఉద్యోగాల కల్పన చేస్తున్నామని కోతలు కోస్తారు. కానీ వాస్తవానికి పరిస్థితులు వేరేలా ఉన్నాయి. భారతదేశంలో ఉద్యోగాలు లేక చదువుకుని ఖాళీగా తిరుగుతున్న ఎంతో మంది యువత నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. దేశానికి యువతే అతిపెద్ద బలంగా చెప్పుకునే రాజకీయ నాయకులు, అటువంటి యువతకు ఉపాధి కల్పించడంలో, ఉద్యోగావకాశాలు ఇవ్వడంలో అడుగడుగున విఫలమవుతున్నారు. చదువులు పూర్తయినా యువతకు ఉద్యోగాలు మాత్రం కరువుగా మారాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు మోడీ మార్క్ షాక్ .. ప్రైవేటీకరణపై ఆయన తాజా వ్యాఖ్యల ఆంతర్యం అదే !!
ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత మోడీకి వినతులు
దేశం మొత్తం మీద ఉన్న ఉద్యోగుల సంఖ్య 40.6 కోట్లు కాగా, వారిలో 30 ఏళ్ల లోపు ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే, మిగతా నలుగురు 30 ఏళ్ల పైబడిన వారే ఉండటం గమనార్హం. 2020నాటికి దేశంలో నిరుద్యోగుల రేటు 23.74 శాతంగా ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగాల కోసం నిరీక్షించి నిరీక్షించి సహనం నశించిన నిరుద్యోగ యువత ఇప్పుడు మోదీ ఉద్యోగమివ్వు అంటూ నినదిస్తున్నారు.
ట్విట్టర్ దద్దరిల్లేలా ట్వీట్ ల వర్షం
సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోడీకి చేరేలా మోదీ రోజ్గార్ దో /మోదీ జాబ్ దో అంటూ తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. గత వారం రోజులుగా ట్విట్టర్లో ఈ హ్యాష్ టాగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది . ఈ ఒక్క రోజులోనే ఈ హ్యాష్ ట్యాగ్ పై సుమారు 50 లక్షల ట్వీట్లు వచ్చాయంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో యువత ఉద్యోగాల లేమి ప్రస్తుతం ట్విట్టర్ ను కుదిపేస్తోంది.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటూ నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రధానిని విమర్శిస్తున్నారు యువత.
మోడీని ఉద్యోగాల కోసం ట్రోల్ చేస్తున్న యువత .. గత హామీలు గుర్తు చేసి మరీ
ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో నిరుద్యోగ యువత గురించి మోడీ చేసిన ట్వీట్ లను, వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇప్పుడు మోదీని ట్రోల్ చేస్తున్నారు .యువత మన్ కీ బాత్ వినండి.. ప్రసంగాలు వాగ్దానాలు కాదు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ ట్వీట్ లను సంధిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదాయ అర్చన కోసం పకోడీలు వేసుకో మన్న వ్యాఖ్యలపై మీమ్స్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, నోట్ల రద్దు ,జిఎస్టి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా నిరుద్యోగ యువత తమ ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తున్నారు.
బాగా పెరిగిపోతున్న నిరుద్యోగ రేటు ..మోడీ నిరుద్యోగుల గోడు వింటారా ?
దేశంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 20 నుంచి 24 సంవత్సరాల వయసు లోపు ఉన్న నిరుద్యోగ రేటు ఏకంగా 37 శాతం. ఇంత తీవ్రంగా పరిస్థితి ఉన్నప్పటికీ ఉద్యోగాలలో , దేశ ఆర్థిక అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయలేకపోతున్న సర్కారు తీరుపై నిరసనగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ మోదీ ఉద్యోగాలు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా నిరుద్యోగ యువతపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిసారిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.