Odisha Mission Shakti: మహిళల సారధ్యంతోనే మెరుగైన ఆర్థిక వ్యవస్థ -Odisha 50 వెబినార్లో వక్తలు
ఆకాశంలో సగంగా ఉన్న మహిళలకు అవకాశం అందించాలేగానీ ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా నడిపించగలరని, కరోనా విలయ కాలంలో ఆ విషయం మరోసారి రుజువైందని సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుజాతా కార్తికేయన్ అన్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ సర్కారు ప్రత్యేకంగా మహిళా సాధికరత కోసమే ప్రారంభించిన 'మిషన్ శక్తి' శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తోన్న ఆమె.. 'Odisha 50' ఇనిషియేటివ్ లో భాగంగా గురువారం జరిగిన వెబినార్లో కీలక ప్రసంగం చేశారు.
ఆర్థిక రంగంలో మహిళలు రాణించాలనే లక్ష్యంతో పట్నాయక్ సర్కారు తలపెట్టిన మిషన్ శక్తిని బలపరిచే దిశగా, ఫిక్కీ, ఖిమ్జీ ఫౌండేషన్ సహకారంతో ఒడిశాలోనే అతిపెద్ద మీడియా సంస్థ 'సంబాద్ గ్రూప్' ఆధ్వర్యంలో 'ఒడిశా 50' పేరుతో కీలక వెబినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారిణి సుజాతా కార్తికేయన్, ఎకనామిస్ట్ ప్రొఫెసర్ ఎన్ఎన్ మిశ్రా, సంబాద్ గ్రూప్ చైర్మన్ సౌమ్య రంజన్ పట్నాయక్(కందపాద బీజేడీ ఎమ్మెల్యే), ఫిక్కీ ఒడిశా యూనిట్ చైర్ పర్సన్ మోనికా నయ్యర్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో నడుస్తోన్న మిషన్ శక్తి శాఖల కంటే, ఒడిశా సర్కారు తలపెట్టిన కార్యక్రమాలు ప్రత్యేకంగా రూపొందించామని, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళల్లో నాయకత్వాన్ని పెంపొందించి, ఆర్థిక రంగంలో వారి పాత్రను బలోపేతం చేయడమే ఒడిశా మిషన్ శక్తి ప్రాథమిక లక్ష్యమని సుజాతా తెలిపారు. కొవిడ్-19 విలయ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు నాయకత్వం వహించాయని, కొవిడ్ రూల్స్ ను ప్రజల చేత పాటింపజేయడంలోగానీ, 70 లక్షలకుపైగా మాస్కులను ఉత్పత్తి చేయడంలోగానీ, వారి సంపాదనలో కొంత భాగాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపడం వరకు మహిళలు తమ సత్తా చాటుకున్నారని ఐఏఎస్ అధికారిణి గుర్తు చేశారు.
ప్రముఖ ఎకనామిస్టు, కేఐఐటీ మేనేజ్మెంట్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ ఎన్ఎన్ మిశ్రా మాట్లాడుతూ... లింగ సమానత్వం, మహిళలకూ సమ న్యాయం గురించిన చర్చ అవసరమని చెప్పారు. మానవ అభివృద్ధి నివేదిక 2020 ప్రకారం, మన దేశంలో.. పురుషుల(76 శాతం)తో పోల్చుకుంటే మార్కెట్లో మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం చాలా తక్కువగా, 23.7శాతంగా ఉందని, అదే చైనాలో మాత్రం మార్కెట్ శ్రామికశక్తిలో పురుషులు 67 శాతం, మహిళలు 60 శాతంగా ఉన్నారని తెలిపారు. ఒడిశాలో పదేళ్ల కిందట 35 శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి ప్రస్తుతం 22 శాతానికి పడిపోయిందని గుర్తుచేశారు.
సంబాద్ గ్రూప్ చైర్మన్, కందపాద ఎమ్మెల్యే సౌమ్య రంజన్ పట్నాయక్ మాట్లాడుతూ.. ఒడిశాలో మహిళా సాధికారత బీజేడీ సర్కారు విశేషంగా కృషి చేస్తున్నదని స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ప్రపంచంలో సగాన్ని విస్మరిస్తే గనుక ఏ విప్లవమూ వర్థిల్లబోదన్న లెనిన్ వ్యాఖ్యలను పట్నాయక్ ప్రస్తావించారు. మహిళలకు అధికారం లభిస్తే అది సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుందని, మహిళలు ఆర్థిక సాధికారత సాధించకపోతే, నిజమైన అర్థంలో సాధికారత సాధించినట్లు కాదని పట్నాయక్ అన్నారు.
ఒడిశాలో మహిళా సాధికరత కోసం సర్కారు ప్రయత్నాలకు తవంతుగా సహకారం అందిస్తోన్న సంబాద్ గ్రూప్ కు ఫిక్కీ ఒడిశా హెడ్ హిమాంన్షు శేఖర్ సాహు అభినందనలు తెలిపారు. సంబాద్ డీజీఎం(న్యూస్) అరబిందా దాస్, మరో డీజీఎం(హెచ్ఆర్) బైజయంతి ఖర్, వివిధ జిల్లాల నుంచి మహిళా స్వయం సహాయక బృందాలు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.