అత్తారింటికెళ్లాడు.. అత్తామామలను సంతోషపెట్టాడు.. చివరికి కాబోయే భార్య గొంతుకోశాడు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు కాబోయే భార్యపై దాడి చేసిన యువకుడు.. బ్లేడుతో చీల్చుతూ తీవ్రంగా గాయపర్చాడు. వెంటనే ఇతర కుటుంబసభ్యులు అప్రమత్తం కావడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏప్రిల్లో నెలలో పెళ్లి..
వివరాల్లోకి వెళితే.. కోరాపుట్ జిల్లా పొట్టంగి సమితి పంచాయతీ పరిధిలోని చింతలగుడ గ్రామానికి చెందిన డుమురి ఖొరా కూతురు సుస్మితా ఖొరాతో సొంబయి గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే యువకుడితో గత కొంత కాలం క్రితం నిశ్చితార్థం అయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్లో వీరిద్దరికి వివాహం నిర్ణయించారు ఇరు కుటుంబాల పెద్దలు.
అత్తామామలను సంతోషపెట్టాడు..
ఈ నేపథ్యంలో విశ్వనాథ్ కాబోయే అల్లుడి హోదాలో అత్తారింటికి తరచూ రాకపోకలు సాగిస్తున్నాడు. పెళ్లికు ముందు నుంచే అమ్మాయిని బాగా చూసుకుంటున్న తమ అల్లుడ్ని చూసి మురిసిపోయారు అత్తామామలు. తమ కూతురుకు మంచి భర్తే దొరికాడని సంబరపడిపోయారు. గురువారం కూడా ఎప్పటిలాగే అత్తారింటికి వచ్చాడు. అత్తామామలు కోరడంతో రాత్రి అక్కడే ఉండిపోయాడు విశ్వనాథ్.
కాబోయే భార్య గొంతుకోశాడు.. బ్లేడుతో విచక్షణారహితంగా..
అయితే, ఏమైందో ఏమోగానీ గురువారం రాత్రి దారుణానికి పాల్పడ్డాడు విశ్వనాథ్. ఒక్కసారిగా ఉన్మాదిగా మారిపోయి కాబోయే భార్యపై బ్లేడుతో దాడి చేశాడు. ఆమె గొంతుకోసి.. ఆమెపై విచక్షణారహితంగా బ్లేడుతో గాయపర్చాడు. దీంతో ఆమె ఆర్తనాదాలు చేసింది. వెంటనే కుటుంబసభ్యులు వచ్చి ఆమెను కాపాడారు.
చివరకు కటకటాలపాలు..
ఆ తర్వాత ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం సుస్మిత ఖొరా ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. సుస్మిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విశ్వనాథ్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే, సుస్మితపై విశ్వనాథ్ ఎందుకు దాడి చేశాడనే విషయం మాత్రం తెలియరాలేదు.