టిట్లి తుఫాను: అల్లకల్లోలంగా సముద్రం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ తుఫాను!
విశాఖపట్నం/న్యూఢిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 8 కిలో మీటర్ల వేగంతో కదులుతూ మంగళవారం మధ్యాహ్నం పదకొండున్నరకు తుఫానుగా మారింది. దీనికి టిట్లి అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
టిట్లీ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గాలులు గంటకు 80 కిలో మీటర్ల నుంచి 90 కిలో మీటర్ల వేగంతో వీచనున్నాయి.
టిట్లీ తుఫాను ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశాలోని గోపాల్పూర్కు దక్షిణ ఆగ్నేయంగా 590 కిలో మీటర్ల దూరంలోనూ, కళింగపట్నంకు ఆగ్నేయంగా 430కి.మీ.ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. బుధవారానికి టిట్లి పెను తుపానుగా మారే అవకాశముంది.
బుధవారం, గురువారం ఒడిశా, ఏపీ తీర ప్రాంతాలు, సమీప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. పడవలు నిలిపివేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
టిట్లి తుఫాను కారణంగా విశాఖలోని రుషికొండ, సాగర్ నగర్ తదితర ప్రాంతాల్లో కెరటాల బీభత్సంతో సముద్రం మంగళవారం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉగ్రరూపం దాల్చి ఆయా తీర ప్రాంతాలకు ఇరువైపులా కి.మీ. మేర కోతకు గురయ్యాయి. కెరటాల తీవ్రతతో సాధారణ రోజుల కంటే సముద్రం దాదాపు 100 నుంచి 150 అడుగుల వరకు ముందుకు వచ్చి అయిదు అడుగులకు పైగా లోతున కోత ఏర్పడింది.