మిస్టర్ క్లీన్ సీఎం: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
ఆయన క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు. ఇప్పటికే ఆ రాష్ట్రానికి నాలుగు సార్లుముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఎలాంటి ఆరోపణలు లేకుండా తండ్రిలా అతి సామాన్యమైన జీవితం గడుపుతున్న ముఖ్యమంత్రుల్లో ఆయనొకరు. ప్రజలు కూడా అతన్ని అంతలా గౌరవించారు... అందుకే అందలమెక్కిస్తూ వచ్చారు. ఇక సార్వత్రిక ఎన్నికల వస్తున్న నేపథ్యంలో నాయకులు తమ అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది. మరి ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన ఈయన ఆస్తులు ఎంతుంటాయ్...? ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు కాబట్టి కొన్ని వందల కోట్లలో ఉంటాయిలే అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే... ఇంతకీ ఆయన ఎవరు... ఆయన ఆస్తులు ఎంత..? ఏ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి..?
అగ్నికి ఆజ్యం పోసిన నివేదిక: సంతోషకరమైన దేశాల్లో భారత్ పాకిస్తాన్ ర్యాంకులు ఇలా ఉన్నాయి
2014లో నవీన్ పట్నాయక్ ఆస్తులు రూ.12 కోట్లు
నవీన్ పట్నాయక్...ఒడిషా ముఖ్యమంత్రి... బీజేడీ అధ్యక్షుడు. మరోసారి తాను పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒడిషా రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నవీన్ పట్నాయక్ తన నామినేషన్ దాఖలు చేశారు. 2014లో నవీన్ పట్నాయక్ అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో ఆయన ఆస్తులను రూ. 12 కోట్లుగా ప్రకటించారు.
ఐదురెట్లు పెరిగిన నవీన్ పట్నాయక్ ఆస్తులు
ఇక 2019 అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ తొలి సారిగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపూర్, హింజిలి నియోజకవర్గాల నుంచి నవీన్ పట్నాయక్ బరిలోకి దిగనున్నారు. ఇందులో భాగంగానే నవీన్ పట్నాయక్ తన అఫిడవిట్లో ఆస్తులను ప్రకటించారు. 2014తో పోలిస్తే ఈ సారి తన ఆస్తుల విలువ ఐదురెట్లు పెరిగింది. 2014లో రూ.12 కోట్లుగా తన ఆస్తులను ప్రకటించిన మిస్టర్ క్లీన్ ఛీఫ్ మినిస్టర్ ఈసారి రూ.63 కోట్లుగా తన ఆస్తులను ప్రకటించారు. ఇందుకు కారణం ఒడిషా, దేశ రాజధాని ఢిల్లీలో తనకున్న ఆస్తుల విలువ అమాంతం పెరగడమే అని అఫిడవిట్లో తెలిపారు.
పెరిగిన స్థిరాస్తుల విలువ
నవీన్ పట్నాయక్ అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.63.87 కోట్లుగా పేర్కొన్నారు. ఇక చరాస్తుల్లో భాగంగా తన దగ్గరున్న నగదు, బ్యాంక్ బ్యాలెన్స, నగల విలువ రూ.23 లక్షలని 2014తో పోలిస్తే ఇది రూ.5 లక్షలు ఎక్కువని తెలుస్తోంది. ఇక స్థిరాస్తుల విషయానికొస్తే..ఇక్కడే తన ఆస్తుల విలువ పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. 2014లో 12 కోట్లుగా ఉన్న వీటి విలువ ఈసారి రూ.63 కోట్లకు చేరుకుంది. తన సోదరి గీతాతో కలిసి ఆయనకు కొన్ని ఆస్తులున్నాయి. న్యూఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇల్లు విలువ రూ.43 కోట్లు కాగా ఒడిషాలోని నవీన్ నివాస్ ఇల్లు విలువ రూ.9.52 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం నవీన్ పట్నాయక్ దగ్గర రూ.25వేలు నగదు చేతిలో ఉండగా... 1980 నాటి అంబాసిడర్ కారు ఉన్నట్లు అఫిడవిట్లో చేర్చారు. ఇక కారు విలువ రూ. 9వేలు అని పేర్కొన్నారు.