చివరికి ఇలా: ఏటీఎంలో మూత్రం పోసిన కానిస్టేబుల్
భువనేశ్వర్: మద్యం మత్తులో ఏటీఎం క్యాబిన్ లో ఓ కానిస్టేబుల్ మూత్రం పోసిన ఘటన ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఆ కానిస్టేబుల్ పేరు సమీర్ సేథీ. కొన్నాళ్లుగా ఒడిశా పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.
మయూర్ భంజ్ లోని బారిపాడలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి అతను విధి నిర్వహణలో ఉంటూ ఫూటుగా మద్యాన్ని సేవించాడు. బారిపాడ మున్సిపల్ కార్యాలయం వద్ద గస్తీ తిరుగుతూ.. మద్యాన్ని సేవించాడు.
అనంతరం మద్యం మత్తులో అక్కడే ఉన్న స్టేట్ బ్యాంక్ ఇండియాకు చెందిన ఏటీఎం క్యాబిన్ లోకి వెళ్లి మూత్రం పోశాడు. అక్కడి నుంచి తూలుతూ.. బూతులు తిడుతూ ఏటీఎం నుంచి బయటికి వచ్చాడు. ఒక నిమిషం ఏడు సెకెన్ల నిడివి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆది తమ దృష్టికి వచ్చిన వెంటనే అతణ్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటం సమీర్ సేథీకి కొత్తేమీ కాదని స్థానికులు చెబుతున్నారు. ఇదివరకు కూడా అతను ఇలాగే ప్రవర్తించడంతో ఒకసారి సస్పెండ్ అయ్యాడని, అయినప్పటికీ తన బుద్ధిని మార్చుకోలేదని అంటున్నారు.