మన పొరుగు రాష్ట్రంలో 30 వరకూ లాక్డౌన్ పొడిగింపు: సీఎం ఆదేశాలు: జూన్ 17 వరకు స్కూళ్లు క్లోజ్
భువనేశ్వర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన లాక్డౌన్ పరిస్థితులు కొనసాగింపుపై కేంద్రం నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందే మన పొరుగునే ఉన్న ఒడిశాఖ ఓ అడుగు ముందుకేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం వెలువడక ముందే లాక్డౌన్ను పొడిగించింది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాస్సేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేశారు. సొంతంగా లాక్డౌన్ను పొడిగించిన తొలి రాష్ట్రంగా నిలిచింది ఒడిశా.
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా..
ఒడిశాలో గురువారం నాటికి 42 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ను విధించడం వల్లే కరోనా పాజిటివ్ కేసులు అదుపులో ఉన్నట్లుగా ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో లాక్డౌన్ను ఎత్తేయడమంటూ జరిగితే పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతాయనే ఆందోళన నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో వ్యక్తమైంది. గిరిజనులు, ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్న ఒడిశాలో లాక్డౌన్ ఎత్తేస్తే.. వైరస్ మరింత వేగంగా విస్తరిస్తుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు.
లాక్డౌన్ పొడిగింపే శరణ్యం..
ఈ మేరకు వారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ఓ నివేదికను అందజేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకని.. కరోనా వైరస్ ఉధృతి తగ్గేంత వరకూ లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలను కూడా జారీ చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ఇప్పటికే లాక్డౌన్లో కొనసాగుతున్నారని, తమ విలువైన సమయాన్ని త్యాగం చేశారని నవీన్ పట్నాయక్ అన్నారు. ఇలాంటి సందర్భల్లో కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
30 వరకూ
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దీన్ని అధిగమించడానికి ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఙప్తి చేశారు. అమెరికా తరహా భయానక పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే లాక్డౌన్ను పొడిగించడం ఒక్కటే మార్గమని చెప్పారు.
అమెరికాను చూస్తున్నాం..
లాక్డౌన్ విధించకపోవడం వల్లే అమెరికా పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని చవి చూస్తోందని నవీన్ పట్నాయక్ అన్నారు. అలాంటి పరిస్థితులు తమ వద్ద ఉత్పన్నం కావాలని ఏ రాష్ట్రం కూడా కోరుకోదని చెప్పారు. లాక్డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది పక్కన పెడితే.. తన రాష్ట్ర ప్రజల ప్రాణాలను నిలపడానికి స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నామని నవీన్ పట్నాయక్ చెప్పారు. వ్యవసాయం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు యధాతథంగా కొనసాగుతాయని అన్నారు.
Recommended Video
రైలు, విమాన సర్వీసులను పునరుద్ధరించొద్దంటూ
లాక్డౌన్ ఎత్తేయాల్సి వచ్చినప్పటికీ.. తమ రాష్ట్రంలో రైళ్లు, విమాన సర్వీసులను పునరుద్ధరించ వద్దని కోరుతూ తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నట్లు నవీన్ పట్నాయక్ తెలిపారు. రవాణా వ్యవస్థను స్తంభింపజేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించవచ్చని అన్నారు. రవాణా అందుబాటులోకి వస్తే.. ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుందని, దీన్ని నివారించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.