క్వారంటైన్ పీరియడ్ ముగించుకున్న వారు ఏమౌతున్నారు? ఎటు వెళ్తున్నారు?
భువనేశ్వర్: కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లు లేదా క్వారంటైన్ సమయాన్ని ముగించుకున్న వారు డిశ్చార్జి కావడం సర్వసాధారణం. వారిని చప్పట్లతో అభినందనలను తెలుపుతూ.. పుష్పగుచ్ఛాలను ఇచ్చి మరీ ఇంటికి పంపించే సందర్భాలను మనం చూశాం. ఒడిశాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసుకున్న వారు ఇళ్లకు చేరట్లేదు. క్వారంటైన్లలోనే ఉంటున్నారు. వారికి ఉపాధిని కల్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. హెల్త్ వర్కర్లుగా వారికి శిక్షణ ఇస్తోంది. అనంతరం వారి సేవలను ఐసొలేషన్ వార్డుల్లో వినియోగించరుకునే వినూత్న ప్రకియను ప్రయోగాత్మకంగా చేపట్టింది.
ఆ రకంగా మేలు చేసిన కరోనా: నైరుతి రుతుపవనాల కదలికల్లో వేగం: ఇంకాస్త ముందే: ఐఎండీ
వచ్చిన వారిని వచ్చినట్టుగా క్వారంటైన్లకు..
వలస జీవులకు పెట్టింది పేరు ఒడిశా. ఈ రాష్ట్రం నుంచి జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలకు పెద్ద ఎత్తున వలస వెళ్తుంటారు. లాక్డౌన్ వల్ల వారంతా స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. కాలి నడకన సొంత రాష్ట్రానికి చేరుకున్న వలస కార్మికులు అధికం. వారందరినీ ప్రభుత్వం క్వారంటైన్లకు తరలించింది. 14 రోజుల పాటు అక్కడే నివాస వసతిని కల్పించింది.
క్వారంటైన్ ముగించుకున్న వారికి హెల్త్ వర్కర్లుగా..
14 రోజుల పాటు క్వారంటైన్ను ముగించిన వారిని ఒడిశా ప్రభుత్వం వదిలేయట్లేదు. హెల్త్ వర్కర్లుగా వారి సేవలను వినియోగించుకుంటోంది. ఈ 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ సమయంలోనే వలస కార్మికులకు హెల్త్ వర్కర్లుగా శిక్షణ ఇస్తోంది. ప్రతిభ కనపరిచిన వారి సేవలను ఐసొలేషన్ వార్డుల్లో వినియోగించుకుంటోంది కూడా. ఇదో వినూత్న ప్రక్రియ. ఇప్పటిదాకా ఇలాంటి ఐడియా ఎవరికీ రాలేదు. క్వారంటైన్లో ఉంటోన్న వారికి హెల్త్ వర్కర్లుగా శిక్షణ ఇప్పించిన అనంతరం, వారి సేవలను ఐసొలేషన్ వార్డుల్లో వినియోగించుకోవాలనే ఆలోచన పట్ల ప్రశంసలు అందుతున్నాయి.
తొలిసారిగా గంజాం జిల్లాలో
గంజాం జిల్లాల్లో ఈ తరహా విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది నవీన్ పట్నాయక్ ప్రభుత్వం. ఉదయం అల్పాహారం ముగిసిన వెంటనే వారికి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. చేతులను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్లు, గ్లోవ్స్ ధరించడం, కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు అందించాల్సిన సేవలు, ఆహారంపై వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ కులంగే తెలిపారు. 21 రోజుల పాటు వారికి శిక్షణ ఇస్తామని, అనంతరం వారి సేవలను ఐసొలేషన్ వార్డుల్లో వినియోగించుకునే ప్రతిపాదన ఉందని చెప్పారు.
40 వేల మంది స్వస్థలాలకు..
దేశంలో లాక్డౌన్ అమల్లోకి తీసుకుని వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 40 వేల మంది వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకున్నట్లు అంచనా వేసింది ప్రభుత్వం. అలాంటి వారి కోసం 2983 క్వారంటైన్ కేంద్రాలను అందబాటులోకి తీసుకుని వచ్చింది. స్వస్థలాలకు చేరుకున్న వారిలో ఎక్కువమంది గుజరాత్లోని సూరత్ నుంచి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మున్ముందు మరింత మంది వలస స్వరాష్ట్రానికి చేరుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వారికి అనుగుణంగా క్వారంటైన్ కేంద్రాలను పెంచుతామని తెలిపారు.