కరోనాకు బరంపురం హోటల్ కొత్త మందు- యాంటీ వైరస్ ఇడ్లీ, సమోసా- సోషల్ మీడియా ట్రోలింగ్..
కరోనా నేపథ్యంలో కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. కరోనాకు దూరంగా ఉండేందుకు జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఓ ఎత్తయితే ఈ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలన్నీ మరో ఎత్తుగా ఉన్నాయి. ఇదే కోవలో వైరస్ నుంచి జనాన్ని రక్షిస్తామంటూ పలువురు ఇప్పటికే రంగంలోకి దిగి అమాయకులను మోసం చేస్తున్నారు కూడా.
అయితే ఒడిశాలోని బరంపురంలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్ మాత్రం ఏకంగా యాంటీవైరస్ టిఫిన్ సెంటర్గా పేరు మార్చేసుకోవడమే కాకుండా యాంటీవైరస్ ఇడ్లీ, సమోసాను కూడా అమ్మేస్తోంది. దీంతో జనం దీన్ని విపరీతంగా ఆదరిస్తున్నారు.కరోనాకు పరిష్కారంగా చెబుతూ బరంపురంలో ప్రారంభించిన ఈ టిఫిన్ సెంటర్ అనతి కాలంలోనే సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయింది. దీంతో ఈ టిఫిన్ సెంటర్కు జనం క్యూ కట్టడం కూడా ఎక్కువైంది.
కరోనా కాలంలో వ్యాపార మెలకువలకు పదునుపెట్టి ఈ వ్యాపారి బాగా సొమ్ముచేసుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో కొందరు అభినందిస్తుండగా.. మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. యాంటీ వైరస్ ఇడ్లీ, సమోసానా, కొంపదీసి ఇందులో శానిటైజర్ కానీ కలపలేదుగా అంటూ చమత్కరిస్తున్నారు. ముఖ్యంగా హోటల్ పేరు యాంటీ వైరస్ టిఫిన్ సెంటర్గా పెట్టడం మాత్రం ఆసక్తి కరంగా మారుతోంది.
ఈ యాంటీ వైరస్ టిఫిన్ సెంటర్లో జనం రద్దీ పెరగడంతో దీనిపైనా ట్రోల్స్ పడుతున్నాయి. టిఫిన్ సెంటర్కు యాంటీ వైరస్ అని పేరు పెట్టడం కాకతాళీయమేమో కానీ జనం రద్దీ మాత్రం నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు ట్రోల్ చేస్తున్నారు. యాంటీ వైరస్ అని పేరు పెట్టుకున్నా అక్కడి వంటవాళ్లు గ్లోవ్స్ తొడుక్కోకుండానే వండేస్తున్నారని, సర్వర్లు సైతం గ్లోవ్స్ లేకుండానే వడ్డించేస్తున్నారని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ యాంటీ వైరస్ దోశ తింటే ఇక రోగనిరోధంగా మారతామని, ఇక మాస్కులూ, భౌతిక దూరాలు ఎందుకని కొందరు ఆడుకుంటున్నారు.