కరోనా వ్యాక్సిన్ భద్రత కోసం మార్గదర్శకాలు జారీ చేసిన ఒడిషా ప్రభుత్వం
భువనేశ్వర్: దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ రవాణా సమయంలో కానీ వాటిని నిల్వ ఉంచే ప్రాంతంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒడిషా ప్రభుత్వం సూచనలు చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు ఒడిషా ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీకే మహోపాత్ర లేఖ రాశారు.
డ్రగ్స్ మరియు కాస్మెటిక్స్ చట్టం 1940 నిబంధనల ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ను అనధికారికంగా నిల్వ ఉంచడం కానీ, సరఫరా చేయడం కానీ కొనుగోలు లేదా అమ్మకానికి పెట్టడం కానీ చేయడం నేరం అని ప్రభుత్వం తెలిపింది. ఇలా తమ దృష్టికి వస్తే వెంటనే డ్రగ్స్ కంట్రోలర్ అధికారి దృష్టికి తీసుకురావడంతో పాటు ఇతర ఉన్నతాధికారులకు కూడా తెలపాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది.
కోవిడ్-19 వ్యాక్సిన్ ఎవరెవరికి ఇచ్చారు, ప్రతి డోస్ను పర్యవేక్షించేందుకు గాను ఎండ్-టూ-ఎండ్ పద్ధతిన కో-విన్ పోర్టల్ ద్వారా సమాచారం సేకరించడం జరుగుతుందని పేర్కొంది. కోవిడ్-19 వ్యాక్సిన్కు సంబంధించిన (పేరు,బ్యాచ్, మానుఫ్యాక్చరింగ్ తేదీ) అన్ని వివరాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో డేటా సేకరించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఏ వ్యాక్సిన్ ఎక్కడికి వెళ్లిందో అన్న పూర్తి సమాచారంను ట్రాక్ చేయడం జరుగుతుందని స్పష్టం చేసింది.