అత్యాచారం చేసిన వాడే జైలులో తాళికట్టిన వేళ...
ఓ యువతిపై అత్యాచారం చేసి జైలుకెళ్లిన నిందితుడే బాధిత యువతిని వివాహం చేసుకున్న విచిత్రమైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని బోనాయ్ సబ్ జైలులో చోటు చేసుకుంది.
భువనేశ్వర్: ఓ యువతిపై అత్యాచారం చేసి జైలుకెళ్లిన నిందితుడే బాధిత యువతిని వివాహం చేసుకున్న విచిత్రమైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని బోనాయ్ సబ్ జైలులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... సుందర్ గఢ్ జిల్లా కుడాయికల గ్రామానికి చెందిన ఓ యువతి గత ఏడాది జులై నెలలో తన బంధువు వివాహానికి వెళ్లి.. అక్కడ బహిర్భూమి కోసం బయటికి వెళ్లింది. దీనిని అదే గ్రామానికి చెందిన ప్రమోద్ పాత్రా గమనించాడు.
ఆమెను అనుసరిస్తూ అతడూ వెళ్లి.. ఎవరూ చూడని సమయంలో ఆ యువతిని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఈ అఘాయిత్యం గురించి ఆమె తన బంధువులకు వివరించంతో పంచాయితీ జరిగింది.
పెద్దమనుషుల ఎదుట చేసిన తప్పుకు క్షమాపణ చెప్పటమేకాక, ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందరూ ప్రమోద్ మాటలు నమ్మారు. అయితే ఆ తరువాత అతడు మాట మార్చడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు అతడిని అరెస్టు చేయడం, జ్యుడీషియల్ రిమాడ్ కు పంపించడం అన్నీ జరిగిపోయాయి. అతడు పెట్టుకున్న బెయిలు పిటీషన్ కూడా తిరస్కరింపబడింది. ప్రస్తుతం విచారణ ఖైదీగా బోనాయ్ సబ్ జైలులో ప్రమోద్ శిక్ష అనుభవిస్తున్నాడు.
మళ్లీ ఇరు కుటుంబాల తరపున పెద్దలు జోక్యం చేసుకోవడంతో రాజీ కుదిరింది. ఈ నేపథ్యంలో తాను అత్యాచారానికి పాల్పడిన యువతినే శనివారం జైలు ఆవరణలోనే జిల్లా వివాహాల అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ న్యాయవాది, జైలు అధికారులు, ఇరు కుటుంబాల బంధుమిత్రుల సమక్షంలో పెళ్లాడాడు.
మూడు ముళ్లు వేయబోయే ముందు కాబోయే భార్యకు అందరి ఎదుట ప్రమోద్ క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసులో కోర్టు తుది తీర్పు కోసం జైలులోనే ఎదురు చూస్తున్నాడు ప్రమోద్.