ఒడిషాలో తయారయ్యే ఈ స్వీట్కు భౌగోళిక గుర్తింపు
భువనేశ్వర్: రసగుల్లా... ఈ బెంగాలీ మిఠాయి పేరు వింటేనే నోరూరుతుంది. ఈ రసగుల్లాకు భౌగోళిక గుర్తింపు లభించింది. అంటే ఈ రసగుల్లా ఒక్క పశ్చిమ బెంగాల్కు మాత్రమే చెందే వంటకంగా గుర్తించడం జరిగింది. తాజాగా ఇదే కోవలోకి ఒడిషా రసగుల్లా కూడా చేరింది. ఒడిషాలో ప్రత్యేకంగా తయారయ్యే ఈ మిఠాయి గతంలో ప్రత్యేక గుర్తింపు కోసం బెంగాలీ రసగుల్లాతో పోటీ పడింది. అయితే 2017లో బెంగాలీ రసగుల్లా మాత్రమే భౌగోళిక గుర్తింపును పొందింది. కానీ ఈ సారి ఒడిషా రసగుల్లా జియోగ్రఫికల్ ఇండికేషన్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. 2015 నుంచి ప్రత్యేక గుర్తింపు కోసం ఒడిషా రసగుల్లా పోటీ పడుతూ వస్తోంది. రెండు రాష్ట్రాలకు చెందిన చరిత్రకారులు రసగుల్లా వారి రాష్ట్రాలకే చెందిన ప్రత్యేకమైన వంటకమంటూ పలు డాక్యుమెంట్లు కూడా సమర్పించారు.
తాజాగా ఒడిషా రసగుల్లాకు కూడా జీఐ ట్యాగ్ను జారీ చేసింది చెన్నైలోని రిజిస్ట్రార్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్. ఈ రసగుల్లాకు ఒడిషా అనే ట్యాగ్ను చేర్చింది. తాజాగా జారీ చేసిన ఈ సర్టిఫికేట్ ఫిబ్రవరి 22, 2028వరకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఒడిషా రసగుల్లాకు జీఐ ట్యాగ్ ఇస్తూ అధికారులు జారీ చేసిన సర్టిఫికేట్ను ఒడిషా అసెంబ్లీ స్పీకర్ సూర్యనారాయణ పాత్రో ట్విటర్లో పోస్టు చేశారు.
ఇక ఒడిషా రసగుల్లాకు జీఐ ట్యాగ్ లభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆ రాష్ట్ర ప్రతిపక్షనేత ప్రదీప్తా నాయక్. అయితే ఈ ప్రత్యేకమైన గుర్తింపు ఎప్పుడో లభించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలస్యంగా అయినా తమ రాష్ట్ర మిఠాయికి ప్రత్యేక గుర్తింపు లభించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అప్పుడు ఈ గుర్తింపు లభించకపోవడానికి కారణం బిజూ జనతాదల్ ప్రభుత్వమే కారణమని అన్నారు. ఒడిషా రసగుల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు లభించిన తర్వాత ట్విటర్ వేదికగా పలువురు ప్రశంసల వర్షం కురింపించారు.
#OdishaRasagola has an unique quality,reputation & characteristic which is attributable to it's geographic origin.I would like to request everyone to get a taste of this unique kind of Rasagola.Much thanks to the entire team who have been trying continuously to give it the GI tag pic.twitter.com/avYpfouBrk
— Surjya Narayan Patro (@SurjyaOfficial) July 29, 2019
జగన్నాథుడికి ఇష్టమైన మిఠాయి రసగుల్లా అని కొందరు ట్విటర్ వేదికగా స్పందించారు.15వ శతాబ్దంలో దండి రామాయణలో రసగుల్లా ప్రస్తావన ఉందని అంటే ఆ కాలం నుంచే ఈ మిఠాయిని తయారు చేస్తున్నారని నెటిజెన్లు తెలిపారు. ఈ మిఠాయి 500 ఏళ్ల నుంచి ఒడిషా రాష్ట్రంలో తయారు చేస్తున్నారని అసిత్ మొహంతి అనే పరిశోధకుడు ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. అంతేకాదు ప్రాచీన ఒడియా పుస్తకాల్లో రసగుల్లా గురించి ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు.