Bhubaneswar : దేశంలోనే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తొలి నగరం... ఎలా సాధ్యమైంది...
కరోనా వ్యాక్సినేషన్లో ఒడిశా దూసుకుపోతోంది. దేశంలోనే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తొలి నగరంగా భువనేశ్వర్ నిలిచింది. నగరంలో 18 ఏళ్లు పైబడిన జనాభా మొత్తానికి జులై 31 నాటికి వ్యాక్సిన్లు వేశారు. అంతేకాదు,1లక్ష మంది వలస కూలీలకు సైతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) జోనల్ డిప్యూటీ కమిషనర్ అన్షుమన్ రథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నగరంలో విస్తృతంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి తక్కువ వ్యవధిలోనే ఈ టార్గెట్ను పూర్తి చేశారు.
ఎంతమందికి వ్యాక్సిన్లు వేశారు..
అన్షుమన్ రథ్ మాట్లాడుతూ...'భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్లో జులై 31 నాటికి అర్హులైన జనాభా మొత్తానికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ క్రమంలో 9,07,000 మందికి రెండో డోసు వ్యాక్సిన్ పూర్తి చేశాం. ఇందులో 31వేల మంది హెల్త్ వర్కర్స్,33వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్, 18-44 ఏజ్ గ్రూప్ వారు 5లక్షల 17వేల మంది,45 ఏళ్లు పైబడినవారు 3లక్షల 25వేల మంది ఉన్నారు. జులై 30 నాటికి దాదాపు 18,35,000 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశాం.' అని వెల్లడించారు.
ఎలా సాధ్యమైంది...
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు భువనేశ్వర్ నగరంలో దాదాపు 55 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 30 కేంద్రాలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్,కమ్యూనిటీ సెంటర్స్లలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే మరో 15 ఇమ్యూనైజేషన్ సెంటర్స్ను,10 డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ పాయింట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీఎంసీ మైక్రో ప్లానింగ్ వల్లే భువనేశ్వర్లో 100 శాతం వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. అలా దేశంలోనే 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తొలి నగరంగా భువనేశ్వర్ నిలిచింది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా సాగుతోంది...
ప్రస్తుతం భారత్లో 18 ఏళ్లు పైబడినవారి జనాభా దాదాపు 94 కోట్లు పైమాటే. వీరందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలంటే 188 కోట్ల డోసులు కావాలి. జులై పూర్తయ్యే నాటికి 47 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ లెక్కన ఏడాది చివరి నాటికి మొత్తం జనాభాకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం కష్టంగానే కనిపిస్తోంది. 153 రోజుల్లో 141 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలంటే... సగటున రోజుకు 92 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయాల్సి ఉంటుంది.
ఈ రెండు నెలల్లో మరో 35 కోట్ల మందికి...?
అవసరానికి సరిపడా వ్యాక్సిన్ల సప్లై లేకపోవడం వల్లే వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని చెబుతున్నారు. అయితే అగస్టు,సెప్టెంబర్ మాసాల్లో దాదాపు 35 కోట్ల వ్యాక్సిన్ సప్లై జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ లెక్కన మరో 35 కోట్ల మందికి ఈ రెండు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే... మిగతా 92 రోజుల్లో 106 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది.రోజుకు సగటున 1కోటి 15లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగితే మొత్తం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి చేయవచ్చు.