బెయిల్ కోసం వస్తే..: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసు అధికారిణి
భువనేశ్వర్: లంచం తీసుకుంటూ మహోస్మిత పండా అనే ఒడిశాకు చెందిన మహిళా పోలీసు అధికారిణి విజిలెన్స్ అధికారులకు చిక్కింది. బాధితుడి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను కటక్ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఓ కేసులో బాధితుడు సుబేందు దాస్.. బెయిల్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో మహోస్మిత .. పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. బెయిల్ కోసం క్లియరెన్స్ ఇవ్వాలంటూ సుబేందు.. పోలీసు ఆఫీసర్ను ఆశ్రయించాడు.
అయితే ఆ ఆఫీసర్ బాధితుడి నుంచి డబ్బు డిమాండ్ చేసింది. దీంతో ఈ విషయాన్ని అతను విజిలెన్స్ అధికారులకు తెలియజేశాడు. ఆ తర్వాత పక్కా ప్రణాళికతో కెమికల్ కోటెడ్ కరెన్సీ నోట్లను పోలీస్ స్టేషన్ ఆవరణలో బాధితుడు ఆ ఆఫీసర్కు అందజేశాడు. ఆ సమయంలోనే విజిలెన్స్ అధికారులు ఆమెను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.