ఆంధ్రప్రదేశ్లో మృతి: భర్త చితిలో దూకేసిన భార్య
భువనేశ్వర్: ఒడిశాలో హృదయాన్ని కలచివేసే సంఘటన జరిగింది. నయగారా జిల్లాలోని ఖందపాడలో ఓ మహిళ తన భర్త చితిలోకి దూకింది. అయితే, ఈ ఘటనలో ఆమె గాయాలతో బయటపడింది.
తన భర్త చనిపోవడంతో ఆమె ఒక్కసారిగా షాక్కు గురయింది. దీంతో, తన భర్త చితిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది.
ఖందపాడకు చెందిన రవీంద్ర సేనాపతికి ఎనిమిది నెలల క్రితం లిపిన సేనాపతి అనే యువతితో వివాహం జరిగింది. తన భర్త మృతి చెందడంతో నిశ్చేష్టురాలైన లిపిన తన భర్త చితిలో దూకింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కావడంతో నయగారా జిల్లా హెట్ క్వార్టర్ ఆసుపత్రికి తరలించారు.
లిపిన సేనాపతి భర్త హైదరాబాదులో పని చేస్తుంటాడు. ఈమె భర్త శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని మృతదేహం ఆదివారం ఖందపాడకు తీసుకు వచ్చారు. అతని చితికి నిప్పు అంటించిన తర్వాత ఆమె ఒక్కసారిగా అందులోకి దూకింది.