మొసలిపై గెరిటతో ఏకవీర పోరాటం
భువనేశ్వర్: మొసలి నుండి తప్పించుకోవడానికి ఆమె ప్రాణాలకు తెగించింది. చివరికి మొసలిని సముద్రం నీటిలోకి తరిమికొట్టి తన ప్రాణాలను రక్షించుకుని వీరనారి అయ్యింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఎలాంటి ఆయుధం లేకుండా కేవలం ఒక పాత్ర, గెరిటతో మొసలికి చుక్కలు చూపించింది.
ఒడిశాలోని బంగాళా తీరంలోని కేంద్రపార జిల్లా సింగిరి గ్రామంలో సావిత్రి సమాల్ (37) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈ గ్రామంలోని ప్రజలు అందరూ నిత్యం సమీపంలోని సముద్రం నుండి పారుతున్న పాయ (కాలువ) దగ్గర బట్టలు, పాత్రలు శుభ్రం చేస్తుంటారు.
శుక్రవారం సావిత్రి పాత్రలు తీసుకుని వెళ్లి కాలువ దగ్గర శుభ్రం చేసుకుంటున్నది. ఆ సందర్బంలో చడిచప్పుడు లేకుండా వెళ్లిన మొసలి ఆమె కాలిని గట్టిగా పట్టుకుని నీళ్లలోకి లాక్కోని వెళ్లింది. ఆ సమయంలో క్షణాలలో తేరుకున్న సావిత్రి చేతిలో ఉన్న గెరిట, పాత్ర తీసుకుని మొసలి తల మీద దాడికి పాల్పడింది.
దాని తల మీద పదేపదే దాడి చెయ్యడంతో అది సావిత్రి కాలు వదిలి పెట్టి నీళ్లలోకి వెళ్లి పోయింది. విషయం గుర్తించిన గ్రామస్తులు సావిత్రిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సావిత్రికి పెద్ద పెద్ద గాయాలు కాకపోవడంతో ఆమెకు చికిత్స చేసి ఇంటికి పంపించామని వైద్యులు తెలిపారు.