అధికారా .. మజాకా.. పల్లకీలో ఊరేగిన ఆఫీసర్.. ఎక్కడో తెలుసా ..?
శ్రీనగర్ : అధికారులు వస్తే .. ఓ ప్రభుత్వ వాహనంలోనూ .. లేదంటే కారులో వస్తారు. మరీ క్రియేటివ్ ఎంప్లాయూస్ అయితే గుర్రం ఎక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే కశ్మీర్లో ఓ ప్రభుత్వాధికారి మాత్రం వింతగా పల్లకిలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఖంగుతినడం గ్రామస్తుల వంతైంది.
రాంబన్ జిల్లా డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ ఆఫీసర్ షౌకత్ ఐజాజ్ భట్ మాత్రం విచిత్రంగా ప్రవర్తించారు. ఓ గ్రామంలో పర్యటించడానికి మాత్రం పల్లకిలో వచ్చారు. అయితే అతను తన పల్లకీని కింది ఉద్యోగులే మోయడం గమనార్హం. విధి నిర్వహణలో ఉద్యోగులకు సాధారణంగా పనులు చెప్తుంటారు. కానీ ఇతను మాత్రం ఏకంగా తననే మోయించుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇంటా బయట సర్వత్రా విమర్శలు రావడంతో భట్ స్పందించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిపారు. అందుకే పల్లకీలో వెళ్లానని సమాధానం చెప్పారు. కానీ దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. అయితే భట్ వెళ్తున్న సమయంలో తీసిన ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరలైంది. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
భట్ ఫోటో నెట్టింట్లో షికార్లు చేస్తోంది. ఓ ప్రభుత్వ అధికారి ఇలా చేస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భట్ వైఖరిపై కామెంట్లు పేలుతున్నాయి. అయితే దీనికి భట్ ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు మాత్రం అంగీకరించడం లేదు. కావాలనే అలా చేశారని దుమ్మెత్తి పోస్తున్నారు.