వీడియో: సముద్రంలో భగ్గుమన్న నౌక: విశాఖపట్నం సమీపంలో ఘటన
Recommended Video
విశాఖపట్నం: విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తీరానికి కొన్ని మీటర్ల దూరంలో సముద్రంలో లంగరు వేసి ఉన్న ఓ నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో మంటలు నౌక మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఆ నౌకలో 29 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదాన్ని శంకించిన వెంటనే వారు లైఫ్ జాకెట్లను ధరించి సముద్రంలో దూకేశారు. వారిలో 28 మందిని తీర ప్రాంత గస్తీ బలగాలు కాపాడాయి. ఒకరు గల్లంతయ్యారు. అతని కోసం గాలిస్తున్నారు.
విశాఖపట్నం ఓడరేవు సమీపంలో సముద్రంలో లంగరు వేసి ఉంచిన ఓ నౌకలో ఈ ఉదయం 11:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నౌకలో చమురును నిల్వ ఉంచిన కొన్ని ట్యాంకులతో పాటు, మంటలను వ్యాపింపజేసే వస్తువులు పెద్ద సంఖ్యలో ఉండటంతో క్షణాల వ్యవధిలో అగ్ని కీలలు నౌకను చుట్టుముట్టాయి. ప్రాణ రక్షణ కోసం ముందుజాగ్రత్తగా అందుబాటులో ఉంచిన టైర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు మంటల బారిన పడ్డాయి. కేప్టెన్ క్యాబిన్ మొత్తం కాలిపోయింది. దట్టమైన పొగ రేగిన సెకెన్ల వ్యవధిలో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
#WATCH Visakhapatnam: At 11:30 am today, 29 crew members of Offshore Support Vessel Coastal Jaguar jumped into water after a fire engulfed the vessel. 28 rescued by Indian Coast Guard. Search for 1 missing crew underway. Exact cause of fire yet to be ascertained. #AndhraPradesh pic.twitter.com/pksYGrC9ZE
— ANI (@ANI) August 12, 2019
నౌకలో మంటలు చెలరేగిన వెంటనే అందులో ఉన్న 29 మంది సిబ్బంది సముద్రంలో దూకారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే తీర ప్రాంత గస్తీ బలగాలు మరో నౌకలో సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సముద్రంలో దూకిన సిబ్బందికి తమ వెంట తెచ్చుకున్న ప్రాణ రక్షక సామాగ్రిని అందజేశాయి. అనంతరం వారిని తాళ్ల సహాయంతో జలాల నుంచి బయటికి తీసుకొచ్చాయి. 28 మందిని కాపాడగలిగాయి. మరొకరు గల్లంతైనట్లు తేలింది. గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది.