మే1 నుంచి నిలిచిపోనున్న చమురు దిగుమతులు..! ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం..!!
దిల్లీ/హైదరాబాద్ : మే1వ తేదీ నుంచి ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతులు నిలిచిపోనున్నాయి. ఒక్క భారత్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా 8 దేశాలకు ఇప్పటి వరకు ఇచ్చిన మినహాయింపులను కూడా నిలిపివేసింది. దీంతో ఇరాన్ నుంచి ఆయా దేశాలు చమురు కొనుగోళ్లను నిలిపివేయనున్నాయి.
ఒక్క చైనా, టర్కీ మాత్రం కొనసాగించనున్నట్లు వెల్లడించాయి. మిగిలిన దేశాలు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కొనే పనిలో పడ్డాయి. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. దీంతో భారత్పై ఈ ప్రభావం అధికంగా ఉండనుంది.
చమురు అత్యధికం ఉత్పత్తి చేసే దేశాల్లో వెనుజువెలా, ఇరాన్ కీలకమైనవి. వీటి నుంచి ఎగుమతులు నిలిచిపోతే ఆమేరకు చమురు మార్కెట్పై ఒత్తిడి పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగే కొద్దీ ముడి చమురు ధర చుక్కల్ని తాకుతుంది. ఇప్పటికే ఈ ఏడాది బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 33శాతం పెరిగింది.
గత ఆరు నెలల్లో అత్యధిక ధరకు సమీపలో ఉంది. ఫలితంగా ఇరాన్, వెనుజువెలా తప్ప మిగిలిన చమురు ఉత్పాదక దేశాల సంస్థలకు, ప్రభుత్వాలకు కనకవర్షం కురవనుంది. కానీ, దిగుమతి చేసుకొనే దేశాలు అధిక ధరల భారాన్ని మాత్రం మోయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది అంతిమంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును దారుణంగా దెబ్బతీసే ప్రమాదముంది.