చమురుతెట్టుతో చెన్నైకి తిప్పలు, 30 ఏళ్ల వరకు ప్రభావం: ఇరాన్ చేసిన పని?
చెన్నై తీరంలో చమురు తెట్టు కలకలం రేపుతోంది. చమురు తెట్టు ప్రభావంతో సముద్రంలోని చేపలు, తాబేళ్లు, ఇతర జల సంపద మృత్యువాత పడుతోంది.
చెన్నై: చెన్నై తీరంలో చమురు తెట్టు కలకలం రేపుతోంది. చమురు తెట్టు ప్రభావంతో సముద్రంలోని చేపలు, తాబేళ్లు, ఇతర జల సంపద మృత్యువాత పడుతోంది. సముద్రంలోని చమురు తెట్టును శుద్ధి చేసేందుకు వేయిమంది సిబ్బంది, వాలంటీర్లు, స్వచ్చంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
32 కిలో మీటర్ల పరిధిలోని తెట్టును తొలగించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. చెన్నై తీరానికి కొట్టుకొస్తున్న చమురు తెట్టు తమిళనాడు ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఎన్నూరు భారతీయార్ సముద్ర తీరంలో రెండు నౌకలు ఢీకొనడంతో ఇది చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో వేలాది టన్నుల ముడిచమురు నీటిపాలైంది. ఈ తెట్టు అలల తాకిడికి చెన్నై మెరీనా తీరం వరకు చేరుకుంది. వేలాదిమంది శ్రమిస్తున్నా.. వారం రోజులవుతున్నా సమస్య పరిష్కారం కావడంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇలాంటి ఉదంతాలెన్నో జరుగుతూనే ఉన్నాయి. దీనివలన పర్యావరణపరంగా తీవ్రమైన నష్టం జరుగుతోంది.
సముద్రాల్లో ఒలికిన చమురు ప్రభావం పర్యావరణంపై దాదాపు 30 సంవత్సరాల వరకు ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది.
కాగా, ఈ చమురు తెట్టు వెనుక మరో కారణం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికాను అడ్డుకునేందుకు ఇరాన్ వేసిన ఎత్తు ఉందని అంటున్నారు. అమెరికన్ నౌకలను అడ్డుకునేందుకు హిందూ మహా సముద్రంలో ఇరాన్ చమురును వదులుతుండగా, అది కొట్టుకుని తమిళనాడు తీరానికి వస్తోందని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందంటున్నారు.
ట్విస్ట్: దీపతో శశికళ వ్యూహాలకు పన్నీరు చెక్! 'ముఖ్యమంత్రి'పై స్టాలిన్
కొన్ని నౌకల్లో ముడి చమురును నింపి, వాటిని సముద్రం మధ్యలోకి పంపుతున్న ఇరాన్, చమురును గుమ్మరిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. చమురు తెట్టు కారణంగా చేపలకు డిమాండ్ పడిపోయిందని, తమ బతుకులు ఇబ్బందుల్లో పడ్డాయని తమిళనాడు మత్స్యకారులు వాపోతున్నారు. గత వారం రోజులుగా వందలాది మంది కోస్టు గార్డులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు చమురు తెట్టును తొలగించేందుకు కృషి చేస్తున్నారు.