క్యాబ్ డ్రైవర్ పై విదేశీయులు దౌర్జన్యం: దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విదేశీయులు రెచ్చిపోయారు. మేము చెప్పిన మాట వినవా అంటూ ఓ క్యాబ్ డ్రైవర్ పై దౌర్జన్యానికి దిగి చితకబాదేశారు. తీవ్రగాయాలైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం వేకువ జామున జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నూరుద్దీన్ (51) అనే వ్యక్తి క్యాబ్ తీసుకుని సోమవారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో ఢిల్లీలోని మెహ్రోలి ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడికి ఆరుగురు ఆఫ్రికన్లు వెళ్లారు.
అందరూ ఒకే క్యాబ్ లో ప్రయాణించాలని నూరుద్దీన్ కు చెప్పారు. క్యాబ్ లో ఎక్కువ మంది ప్రయాణించడానికి నియమాలు అంగీకరించవని, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుంటారని నూరుద్దిన్ చెప్పాడు. అయితే ఆఫ్రికన్లు రెచ్చి పోయారు. మేము చెప్పింది వినవా అంటూ అతని మీద ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులతో దాడి చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన ఆఫ్రికన్లలో ఇద్దరు మహిళలు ఉన్నారని బాధితుడు ఫిర్యాదు చేశాడని, సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.