కర్ణాటకలో "ఓలా" కు బ్రేక్.. 6 నెలలు నిషేధం..!
బెంగళూరు : రవాణా రంగంలో దూసుకెళుతున్న ఓలా క్యాబ్ సర్వీస్ సంస్థకు పెద్ద షాక్ తగిలింది. కర్ణాటకలో ఆ సంస్థ సర్వీసులకు బ్రేక్ పడింది. ఓలా ట్యాక్సీలతో పాటు ఆటోలపై కర్ణాటక రవాణా శాఖ 6 నెలల పాటు నిషేధం విధించింది. ఎలాంటి అనుమతులు లేకుండా బైక్ ట్యాక్సీలు నడుపుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మృత్యుంజయుడు.. కూలిన భవనం కింద 62 గంటలు (వీడియో)
బైక్ ట్యాక్సీలపై కొరడా
బైక్ ట్యాక్సీలు నడపడాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రవాణా శాఖ రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఓలా సంస్థ బైక్ ట్యాక్సీలు యదేచ్ఛగా నడుపుతోంది. జనవరి నెల నుంచి బెంగళూరులోని కొన్ని ఏరియాల్లో బైక్ ట్యాక్సీలు నడుపుతోంది. దాంతో ఓలా సంస్థకు ఇదివరకే రవాణా శాఖ షోకాజ్ నోటీసులు కూడా జారీచేసింది.
బీటా పైలట్.. ఓలా వెర్షన్
అయితే ప్రజల నుంచి సమాచారం సేకరించడంలో భాగంగా బీటా పైలట్ ప్రాజెక్ట్ కింద బైక్ ట్యాక్సీలు నడుపుతున్నట్లు వివరణ ఇచ్చింది ఆ సంస్థ. ఓలా నిర్వాహకుల సమాధానంతో సంతృప్తి చెందని రవాణా శాఖ అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. 6 నెలల పాటు ఓలా లైసెన్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఓలా సంస్థకు చెందిన ట్యాక్సీలు, ఆటోలు నడపకుండా నిషేధం విధించింది.
చట్టాలను అతిక్రమించం : ఓలా
కర్ణాటక రవాణా శాఖ తీరుపై ఓలా నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓలా పై నిషేధం విధించడంపై అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థపై 6 నెలల పాటు నిషేధమనేది దురుదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజా రవాణా మెరుగుపరచడానికి ఓలా సంసిద్ధంగా ఉందని, అందులో భాగంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. చట్టాలకు అనుగుణంగానే ఓలా పనితీరు ఉంటుందని స్పష్టం చేశారు.