ఓలా క్యాబ్స్ సీఈఓ నానమ్మ, పిన్ని దారుణ హత్య
లూధియానా: దేశంలో ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలా సంస్థ సీఈఓ భవిశ్ అగర్వాల్ నానమ్మ, పిన్ని పంజాబ్లోని లూధియానాలో వారి నివాసంలో హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వారిని తీవ్రంగా గాయపరిచి హత్య చేశారు. జనవరి 29న అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
భవిశ్ నానమ్మ పుష్పవతి అగర్వాల్(84), గైనకాలజిస్ట్గా పనిచేస్తున్న పిన్ని డాక్టర్ సరితా అగర్వాల్ (57)ల జంట హత్యలు నగరంలో సంచలనం సృష్టించాయి. నానమ్మ పుష్పవతితో భవిశ్కు చిన్ననాటినుంచి మంచి అనుబంధం ఉంది. వీరి అంత్యక్రియలకు భవిశ్ హాజరయ్యారు.
భవిశ్ బాబాయి అయిన డాక్టర్ రాకేశ్ అగర్వాల్, అతడి భార్య సరితా అగర్వాల్లు ఇద్దరూ లూధియానాలో వైద్యులు. వారి వద్దనే భవిశ్ నానమ్మ పుష్పవతి అగర్వాల్ ఉంటున్నారు.హత్యలు జరగడానికి ముందు పోలీసు కంట్రోల్ రూంకు వారి ఇంట్లో పనిచేసే పూజ అనే మహిళ ఫోన్ నుంచి ఓ బ్లాంక్ కాల్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
తర్వాత హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. బ్లాంక్కాల్ను పోలీసులు పట్టించుకోలేదు. హత్యల విషయం వెలుగుచూశాక పోలీసులు పూజను విచారిస్తున్నారు. కొంతకాలం క్రితం ఈ ఇంట్లో డ్రైవర్లుగా పని చేసిన ఇద్దరు తమ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోయారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దోపిడీ కేసుగా భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, గత డిసెంబర్ 30న అగర్వాల్ తాత బిఆర్ అగర్వాల్ మృతి చెందారు.