కొడవళ్లతో వచ్చిన దొంగలను తరిమికొట్టిన బామ్మ, తాతయ్య..!! (వీడియో)
Recommended Video
తిరునల్వేలి: దేశంలో దొంగల బెడద ఎక్కువైపోయింది. నిన్న మొన్నటివరకు చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ వాసులకు నిద్రలేకుండా చేసింది. ఇక చెన్నైలో కూడా ఇదే తరహా దొంగలు పడ్డారు. అయితే వారి టార్గెట్ వృద్ధ దంపతులు . వృద్ధ దంపతులు ఉన్న ఇంటిని టార్గెట్గా చేసుకుని ఆ ఇంటిని దోచేందుకు రాత్రివేళల్లో వస్తుంటారు. తమిళనాడులోని తిరునల్వేలిలో ఓ వృద్ధ జంట నివాసం ఉంటున్న ఇంటికి దొంగలు వచ్చారు. ఆ సమయంలో ఇంటి యజమాని అయిన వృద్ధుడు బయట కుర్చీలో కూర్చున్నాడు.
వృద్ధుడు కూర్చున్న వెనకవైపు నుంచి ముఖాలకు ముసుగులు ధరించిన దొంగలు మెల్లగా లోపలికి ప్రవేశించారు. అందులో ఒక దొంగ చేత్తో కత్తి పట్టుకుని వృద్ధుడి మెడకు టవాలు గట్టిగా బిగించాడు. వృద్ధుడు గట్టిగా కేకలు వేయడంతో లోపల ఉన్న ఆయన భార్య వెంటనే బయటకు పరుగులు తీసింది. దొంగలు తన భర్తను కత్తులతో బెదిరిస్తుండటం చూసి వెంటనే చెప్పులు, ఇతర వస్తువులతో వారిపై దాడి చేసింది. బామ్మ దాడి చేస్తున్న సమయంలో దొంగ వృద్ధుడిని వదిలేశాడు. ఇక ఆ వృద్ధుడు కూడా కుర్చీలు, చేతికందిన ఇతర వస్తువులతో దొంగలపైకి దాడి చేశాడు.
ఇలా దొంగలు కూడా ఎదురుదాడి చేసినప్పటికీ వృద్ధ దంపతులు ఎక్కడా తగ్గలేదు. గట్టిగా కేకలు వేస్తూ దొంగలపై దాడి చేశారు. ఇక కాసేపు ఈ ఫైట్ జరిగిన తర్వాత వృద్ధ దంపతులు వేసే కేకలకు చుట్టుపక్కల వారు ఎవరైనా వస్తే తమ సంగతి అంతే అని గ్రహించిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ ఆ వృద్ధ దంపతులు నివాసముంటున్న ఇంటికి బిగించిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వృద్ధ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్లు.
తమిళనాడులో ఈ మధ్యకాలంలో వృద్దులు నివాసముంటున్న ఇళ్లనే టార్గెట్గా చేసుకుంటున్నారు దొంగలు. అదే వీధిలో జరిగిన మరో దొంగతనంలో ఓ వృద్ధ జంట నివాసముంటున్న ఇంట్లో నుంచి రూ.50 లక్షలు దోచుకెళ్లారు. ఇది తిరునల్వేలిలో హాట్టాపిక్గా మారింది. వృద్ధులు నివాసముంటున్న ఇళ్లలో చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు.