దొంగలను తరిమికొట్టిన ధైర్యం.. ఆ వృద్ధ దంపతులకు సాహస పురస్కారం (వీడియో)
Recommended Video
చెన్నై : దొంగలను చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. ఆకస్మాత్తుగా వచ్చి దాడి చేస్తే ఒంట్లో వణుకుపుడుతుంది. ఇక కత్తులతో వచ్చే దొంగలను చూస్తే ఎంతటి ధైర్యవంతులైనా జడుసుకుంటారు. కానీ తమిళనాడుకు చెందిన వృద్ధ దంపతులు మాత్రం ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఇద్దరు దొంగలు ముసుగేసుకుని వచ్చి కత్తులతో భయపెట్టి దోచుకోవాలని చూస్తే వారిని గుండె ధైర్యంతో ఎదిరించారు. కత్తులతో వారు మీదమీదకొచ్చినా.. వృద్ధ దంపతులు ఏమాత్రం భయపడలేదు. అయితే తమిళనాడు ప్రభుత్వం వారి ధైర్యాన్ని గుర్తించి సత్కరించింది.
రాజకీయ బద్ధ శత్రువులు.. ఒకే స్టేజీ మీద దర్శనం.. మంథనిలో టెన్షన్..!
వృద్ద దంపతుల ధైర్య సాహసాలు.. దొంగలకు చుక్కలు
తమిళనాడు తిరునల్వేలి జిల్లా కల్యాణపురంకు చెందిన షణ్ముగవేల్, సెంతామరై దంపతులకు సాహస పురస్కారం దక్కింది. ఇద్దరు దొంగలు ముసుగేసుకుని వచ్చి తమపై దాడికి యత్నంచి దొంగతనానికి ప్రయత్నించిన క్రమంలో వారు ఎదురు తిరిగారు. అత్యంత ధైర్య సాహసాలతో వారిని ఎదురించారు. చాలాసేపు వారితో పోరాడి చుక్కలు చూపించారు. చివరకు ఆ దొంగలు తోకముడిచి వచ్చిన దారినే వెళ్లిపోయారు. అయితే వీరి గుండె ధైర్యాన్ని మెచ్చుకుని తమిళనాడు ప్రభుత్వం సముచితంగా గౌరవించింది.
దొంగలను ఎదురించిన ధైర్యం.. సాహస పురస్కారం
73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో షణ్ముగవేల్, సెంతామరై దంపతులకు.. తమిళనాడు సీఎం పళనిస్వామి సాహస పురస్కారం ప్రధానం చేశారు. తిరునల్వేలి జిల్లా కలెక్టర్ శిల్ప ప్రభాకర్ వీరి పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో సీఎం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. అవార్డు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు షణ్ముగవేల్. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇలాంటి పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తమ ఇంట్లో దొంగలు పడిన ఘటనపై వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చామని.. ఆ క్రమంలో వేగంగా స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
నో టికెట్, ఫ్రీ జర్నీ.. మెట్రోలో, బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రాఖీ కానుక
దొంగల చేతిలో కత్తులున్నా.. భయపడలేదుగా..!
తమిళనాడు తిరునల్వేలి కల్యాణపురంలో ఈ ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. ఇటీవల ఇద్దరు దొంగలు ముసుగులు ధరించి వీరి ఇంట్లో చోరీకి ప్రయత్నించారు. రాత్రి సమయంలో వీరి ఇంటికొచ్చిన దొంగలు.. ఆరు బయట కూర్చున్న షణ్ముగవేల్ను టార్గెట్ చేస్తూ అటాక్ చేశారు. ఆ క్రమంలో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. బయట పెద్దగా అరుపులు వినిపించడంతో లోపలి నుంచి సెంతామరై వేగంగా వచ్చారు. అప్పటికే ఆ పెద్దాయనపై దొంగలు దాడి చేస్తుండటం చూసి ఆమె ఎదురుతిరగడం ప్రారంభించారు. దాంతో షణ్ముగవేల్ కూడా తేరుకుని దొంగలపై ఎదురుదాడికి దిగారు.
వీరి ధైర్య సాహసాలు చూసి దొంగలు పరార్..!
కత్తులు చేతబట్టి ఇద్దరు దొంగలు ఆ వృద్ధ దంపతులపై చాలాసేపు అటాక్ చేయాలని చూశారు. కానీ వారికి ఆ ఛాన్స్ దక్కలేదు. వృద్ధ దంపతుల చేతికి ఏది దొరికితే అది దొంగలపై విసురుతూనే ఉన్నారు. అలా వచ్చిన దొంగలకు చుక్కలు చూపించారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న దొంగలు చివరకు తోక ముడవక తప్పలేదు. ఓల్డ్ కపుల్ ధైర్య సాహసాలు చూసి.. చివరకు వచ్చిన దారినే పారిపోయారు.
ఆ వృద్ధ దంపతులు దొంగలను ఎదురించిన తీరు మొత్తం సీసీటీవిలో రికార్డయింది. అది కాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది కాస్తా ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారి పేర్లను సాహస పురస్కారానికి సిఫార్సు చేశారు జిల్లా కలెక్టర్.